పంట నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక

ABN , First Publish Date - 2020-12-03T06:34:06+05:30 IST

తుఫాన్‌ కారణంగా జిల్లాలో గత వారం కురిసిన భారీవర్షాలకు నీటమునిగి, పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజులపాటు కేంద్ర బృందం పర్యటించనున్నది.

పంట నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక
రావికమతం మండలంలో నీటమునిగిన వరిపైరు (ఫైల్‌)

నేడు,రేపు మండలాల్లో పర్యటన

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో వరి పొలాల సందర్శన

రైతుల నుంచి వివరాల సేకరణ

పంట నష్టంపై జిల్లా స్థాయిలో కొనసా...గుతున్న సర్వే


విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా జిల్లాలో గత వారం కురిసిన భారీవర్షాలకు నీటమునిగి, పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజులపాటు కేంద్ర బృందం పర్యటించనున్నది. తడిసిన, నీట మునిగిన వరి పంటను పరిశీలించి ధాన్యం ఏ మేరకు రంగు మారింది, ఎంతమేర మొలకెత్తిందీ...తదితర అంశాలపై రైతులతో మాట్లాడనున్నది. వీటి ప్రకారం పంట నష్టంపై ఒక అంచనాకు వస్తారని తెలిసింది.


కేంద్ర పౌర సరఫరాల శాఖ పరిధిలో పట్నాలో వున్న స్టోరేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.జడ్‌.ఖాన్‌, హైదరాబాద్‌లో స్టోరేజ్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ అధికారులు నవీన్‌, జి.కిరణ్‌కుమార్‌లతో కూడిన అధికారుల బృందం గురువారం పాయకరావుపేట, ఎలమంచిలి, రాంబిల్లి, మునగపాక, కశింకోట, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, సబ్బవరం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో; శుక్రవారం నర్సీపట్నం, చింతపల్లితోపాటు మరికొన్ని మండలాల్లో పర్యటించనున్నది. వరి పంటకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయనున్నది. ‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా జిల్లాలో వివిధ పంటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడంలో ఇప్పటికే వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. వర్షాలకు ముందు కోత కోసిన పొలాల్లో నీట మునిగిన/కుళ్లిపోయిన వరి పంట వివరాలు, కోత కోయకుండా గాలులకు నేలకొరిగి, నీటిలో మునిగిన పంట వివరాలు నమోదుచేస్తున్నారు. జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆదివారం నుంచి క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బుధవారం వరకు సుమారు 1,500 హెక్టార్లలో వరి పంట నష్టం వివరాలు నమోదు చేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో పంట నష్టం అంచనాకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.

Updated Date - 2020-12-03T06:34:06+05:30 IST