వచ్చారు.. వెళ్లారు..
ABN , First Publish Date - 2022-01-23T06:10:25+05:30 IST
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సాగునీటి కాలువ ఆక్రమించిన వ్యవహారంపై జలవనరులశాఖ అధికారులు శనివారం విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే కాలువ ఆక్రమణపై ఇరిగేషన్ అధికారుల విచారణ
మరికొన్ని రికార్డులు కావాలంటూ మధ్యలోనే వెనక్కి
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సాగునీటి కాలువ ఆక్రమించిన వ్యవహారంపై జలవనరులశాఖ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. అయితే అదంతా తూతూమంత్రంగానే సాగింది. ‘ఆంధ్రజ్యోతి’లో ఈ విషయమై కథనం రావటం, గురువారం తహసీల్దార్ ప్రాఽథమిక పరిశీలన చేసి విచారణ చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరటం తెలిసిందే. ఆ మేరకు గుండ్లకమ్మ ప్రాజెక్టు డీఈ బోలయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించారు. కొలతలు తీసుకున్నారు. అయితే ఆక్రమిత ప్రాంతానికి అడ్డంగా కట్టిన తెర లోపల పెద్దగా పరిశీలన చేయలేదు. తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం విచారణ కొనసాగించలేమని అదనపు రికార్డులు అవసరమని బోలయ్య తెలిపారు. భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం, రోడ్లు, భవనాల శాఖల నుంచి కొన్ని రికార్డులు అవసరమని వాటిని తెప్పించుకుని తదనుగుణంగా తదుపరి విచారణ చేస్తామని చెప్పారు. అఽధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడితోనే తూతూమంత్రంగా విచారణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.