కళ, జీవితం

ABN , First Publish Date - 2020-05-29T05:46:11+05:30 IST

ఆయన మొన్న రాలిపోయాడు. ఐతే, గుత్తులు గుత్తులుగా పూలను పూసిన తర్వాత, రాసులు రాసులుగా పండ్లను కాసిన తరువాత. అవి మల్లెల కంటే గుమ గుమలాడే పూలు, అవి మామిళ్ళ కంటే నోరూరించే పండ్లు...

కళ, జీవితం

ఆయన మొన్న రాలిపోయాడు. ఐతే, గుత్తులు గుత్తులుగా పూలను పూసిన తర్వాత, రాసులు రాసులుగా పండ్లను కాసిన తరువాత. అవి మల్లెల కంటే గుమ గుమలాడే పూలు, అవి మామిళ్ళ కంటే నోరూరించే పండ్లు. ఆయన పేరు జామినీ రాయ్. అది దేశ దేశాలకు ప్రాకిన పేరు, తరతరాలకు నిలవ గల పేరు.


అప్పటి కళ కేవలం ‘డ్రాయింగ్ రూమ్’కు పరిమితం కాదు, అది వంట ఇంటిలోకి కూడా విస్తరించి ఉండేది. అది కుండ కానివ్వండి, మూకుడు కానివ్వండి, తెడ్డు కానివ్వండి, గరిటె కానివ్వండి, పంచపాత్ర కానివ్వండి-.. ప్రతిదీ కళాత్మకంగా ఉండేది. ఒక కళాఖండంగా ఉండేది. అందువల్ల ఆనాటి ప్రజా జీవితంలో, గృహ జీవితంలో నిత్య జీవితంలో అందం ఉండేది, చందం ఉండేది, నిండుతనం ఉండేది.


శ్రీ జామినీరాయ్ పుట్టింది బంకూరా జిల్లాలోని ఒక గ్రామంలో. ఆయనకు చదువు అబ్బలేదుకాని, మట్టి బొమ్మలు చేయడంలో నేర్పు అబ్బింది. ఆ బొమ్మలను చేసేవారే ఆయనకు విద్యా గురువులు. వారి నుండి ఆయన నేర్చుకున్నది మట్టికి రూపు దిద్దడం మాత్రమే కాదు, తన జీవితానికి రూపు దిద్దుకొనడం కూడా. అవనీంద్రనాథ్ టాగోర్, ఆయన ప్రియశిష్యుడు నందలాల్ బోస్ -వీరిద్దరు అప్పటిలో సుప్రసిద్ధ చిత్రకారులు. ఐనా వారి అడుగు జాడలలో జామినీరాయ్ నడవ లేదు. తన తొలి గురువుల పుంత వెంటనే తన జానపద గురువుల బాట వెంటనే -ఆయన వెళ్ళారు. ఐతే, ఆయన చేరింది, పాత ఊరును కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని.


శ్రీ జామినీరాయ్ ‘ఆర్టిస్ట్’ కాదని, ‘ఆర్టిజాన్’ మాత్రమే అని చులకన చేసేవారు కొందరున్నారు. ఇది ఒక పూర్వ సంప్రదాయాన్ని, ఒక ప్రశస్త సంప్రదాయాన్ని చులకన చేయడమే. ఆనంద కుమారస్వామి రాసినట్టు, ఒకనాడు మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో ఒకే వ్యక్తి ‘ఆర్టిస్టు’, ‘ఆర్టిజాన్’ కూడా. అందువల్లనే ప్రజల బతుకుల్లో కళ పెనవేసుకుని ఉండేది. అప్పటి కళ కేవలం ‘డ్రాయింగ్ రూమ్’కు పరిమితం కాదు, అది వంట ఇంటిలోకి కూడా విస్తరించి ఉండేది. అది కుండ కానివ్వండి, మూకుడు కానివ్వండి, తెడ్డు కానివ్వండి, గరిటె కానివ్వండి, పంచపాత్ర కానివ్వండి... -ప్రతిదీ కళాత్మకంగా ఉండేది. ఒక కళాఖండంగా ఉండేది. అందువల్ల ఆనాటి ప్రజా జీవితంలో, గృహ జీవితంలో నిత్య జీవితంలో అందం ఉండేది, చందం ఉండేది, నిండుతనం ఉండేది. 


కళకు, జీవితానికి తిరిగి ఇట్టి సంబంధం కుదర్చడమే శ్రీజామినీరాయ్ లక్ష్యం. అందువల్ల ఆయన జానపద కళారీతులను సొంతం చేసుకున్నాడు. ఆ రీతులను యథాతథంగా అనుసరించక, వాటిపై తన వ్యక్తిత్వాన్ని ముద్ర వేశాడు. మొద్దుగీతలు గీస్తూ వాటిలో సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని పొదగడం జామినీరామ్ ప్రత్యేకత. మట్టి రంగులను వాడుతూ, వాటికి కొత్త మెరుగులను, సొబగులను కూర్చడం ఆయన వైశిష్ట్యం. కొయ్య బొమ్మల వలె, మట్టి బొమ్మల వలె ఆయన మానవ మూర్తులను చిత్రించినా, వాటి స్థూలత్వంలో ఏవో లోతులు కనబడతాయి. వాటి స్థాణుత్వంలో ఏదో స్పందన కనబడుతుంది. శ్రీ జామినీరాయ్ మరణించాడు. ఐనా, ఆయన తన కళ ద్వారా జీవిస్తూనే ఉంటాడు. రేఖలకు, వర్ణాలకు ప్రాణం పోసి ఆయనొక నూతన జగత్తును సృష్టించాడు. ఆ జగత్తు నిలిచి ఉండువరకు ఆయన నిలిచే ఉంటాడు.

1972 ఏప్రిల్ 28 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘అమరుడు: శ్రీ జామినీరాయ్’ నుంచి

Updated Date - 2020-05-29T05:46:11+05:30 IST