అవినీతి కోఆపరేషన్‌

ABN , First Publish Date - 2021-04-11T06:55:46+05:30 IST

ఆర్యాపురం కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లో అవినీతి కోపరేషన్‌ షరా మామూలైంది. గత పాలకవర్గం హయాంలో పాలకవర్గ సభ్యులు, ముఖ్య అధికారులు ఒకరికొకరు సహకరించుకుని ఏకంగా రూ.5.62 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.

అవినీతి కోఆపరేషన్‌

ఆర్యాపురం బ్యాంక్‌లో రూ.5.62 కోట్ల అవకతవకలు

 పాలకవర్గం, ముఖ్య అధికారులు కుమ్మక్కై స్వాహా

51 ఎంక్వయిరీలో ధ్రువీకరణ.. చర్యలకు ప్రతిపాదన

మాజీ చైర్మన్‌ శంకరరావు, మాజీ సీఈవో సుబ్రహ్మణ్యం, సుధాకర్‌తోపాటు పలువురి ప్రమేయం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఆర్యాపురం కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లో అవినీతి కోపరేషన్‌ షరా మామూలైంది. గత పాలకవర్గం హయాంలో పాలకవర్గ సభ్యులు, ముఖ్య అధికారులు ఒకరికొకరు సహకరించుకుని ఏకంగా రూ.5.62 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ చల్లా శంకరరావు, మాజీ సీఈవోలు సీవీఎస్‌ సుబ్రహ్మణ్యం, జీ సుధాకర్‌, మరికొందరు డైరెక్టర్ల ప్రమేయం ఉన్నట్టు 1964 ఏపీసీఎస్‌ చట్టం 51 సెక్షన్‌ ప్రకారం నిర్వహించిన ఎంక్వయిరీలో ధ్రువీకరణ అయింది. వీరిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదించారు. 2014 ముందు నుంచి, 2020 మధ్య ఈ అవకతవకలు జరిగాయి. వీటిపై అనేక ఆరోపణలు రావడంతో విచారణ నిర్వహించారు. జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ వీవీ ఫణికుమార్‌ విచారణ జరిపి ఇటీవల రిపోర్టు ఇచ్చారు. రాజమహేంద్ర వరం జేఎన్‌ రోడ్డులోనూ, కాతేరులోను ఆర్యాపురం బ్యాంక్‌ కోసం భూమి కొను గోలు చేశారు. ఇందులో రూ.98,24,000 అవకతవలు జరిగినట్టు ధ్రువీకరించారు. జేఎన్‌ రోడ్డులో నిర్మించిన భవనం విషయంలో రూ.8,18,567 అవకతవకలు జరిగినట్టు ధ్రువీకరించారు. కాతేరులోని భవన నిర్మాణంలో రూ.8,77,891, విన్‌బెర్గర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అడ్వాన్స్‌ ఇవ్వడంలో రూ.1,96,668 అక్రమాలు జరిగాయి. ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు లోన్‌కు సంబంధించిన ఇం ట్రస్ట్‌ మోడిఫికేషన్‌లో రూ.9,03,915, సరస్వతీ మంగతాయా రు లోన్‌కు సంబంధించిన వడ్డీ మోడిఫికేషన్‌లో రూ.5,60,901 అక్రమాలు జరిగినట్టు తేలింది. ఇంకా హారికా మినరల్స్‌కు సంబంధించిన లోన్‌ ఇంట్రస్ట్‌ విషయంలో రూ.5,26,629 అవకతవకలు జరగగా, రూ.2014-2016 మధ్యలో ఉద్యోగుల నియామకం విషయంలో రూ.4,80,000 అవకతవకలు జరిగాయి. 2016-18లో ఉద్యోగుల నియామకంలో రూ.1,02,71,408, రిటైర్డ్‌ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వడంలో 2018-20 మధ్యలో రూ.10,49,771, స్టాఫ్‌కు అక్రమంగా అదనపు అలవెన్స్‌ ఇవ్వ డంలో రూ.11,43,950, డైరెక్టర్లకు శిక్షణ సమయంలో అక్రమ ఖర్చులు రూ.65,190 ఉన్నట్టు తేలింది. 7331 రిట్‌ పిటిషన్‌కు సంబంధించి లాయర్‌కు కోర్టు ఫీజ్‌ విషయంలో రూ.1,50,000, పుట్టినరోజు ఖర్చుల కింద రూ.90,440, స్టాఫ్‌కు అనవసర గిఫ్ట్‌ లు ఇవ్వడంలో రూ.6,72,000 అవకతవకలు జరిగినట్టు తేలిం ది. 2014-2016లో సీజీఎఫ్‌ పేమెంట్స్‌ విషయంలో రూ.1,90, 000లో అవకతవకలు జరగగా, 2016-2020లో సీజీఎస్‌ పే మెంట్స్‌ విషయంలో రూ.2,81,000, గ్రాడ్యుటీ పేమెంట్స్‌ విషయంలో రూ.78,13,959 అవకతవకలు జరిగినట్టు తేలింది. ఉద్యోగుల లోన్‌ల విషయంలో రూ.19,76,017, 2014-2016 మధ్య ప్రావిడెంట్‌ ఫండ్‌ అక్రమ చెల్లింపుల విషయంలో రూ. 22,55,494, 2016-2020 మధ్య ప్రావిడెంట్‌ ఫండ్‌ విషయంలో రూ.43,41,902 అక్రమాలు జరిగినట్టు తేలింది. మొత్తం 22 అంశాల్లో 5 కోట్ల 62 లక్షల 69 వేల 859 రూపాయల 98 పైసలు అవకతవకలు జరిగినట్టు తేలింది. ఎక్కువ కేసుల్లో మాజీ సీఈవోలు, మాజీ చైర్మన్‌ ప్రమేయం ఉండగా, మిగతా వాటిలో వీరితోపాలు పలువురు మాజీ డైరెక్టర్ల ప్రమేయం ఉన్నట్టు ఎంక్వయిరీలో తేలింది. ఎంక్వయిరీ జరిగిన మాట నిజమేనని.. ఇటీవల నివేదిక ఇచ్చారని, ఈ ఎంక్వయిరీని డీసీఏవో వీవీ ఫణికుమార్‌ నిర్వహించారని రాజమహేంద్రవరం సహకార శాఖ డీఆర్‌ నాగభూషణం తెలిపారు.

Updated Date - 2021-04-11T06:55:46+05:30 IST