ఆ చట్టాలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలి: సీఎం

ABN , First Publish Date - 2020-12-04T21:44:13+05:30 IST

కేంద్ర ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకుని, రైతుల పట్ల ..

ఆ చట్టాలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలి: సీఎం

జైపూర్: కేంద్ర ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకుని, రైతుల పట్ల అనుసరించిన 'అనుచిత ప్రవర్తన'కు క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. చట్టాలు చేసే ముందు రైతులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నందునే ఇవాళ రైతులు రోడ్లపైకి వచ్చారని గెహ్లాట్ ఓ ట్వీట్‌లో కేంద్రంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టాలపై రైతుల తరఫున చర్చించేందుకు రాష్ట్రపతిని  పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  సమయం కోరినప్పటికీ, ఆయన ఎలాంటి సమయం కేటాయించలేదని అన్నారు. రైతులతో ఒక్క మాట కూడా చెప్పకుండా చట్టాలు తెచ్చినందువల్లే ఇవాళ రైతులు రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు.


కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 32 రైతు సంఘాలు ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారంతో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. కేంద్రం నిర్ణయంపై అశోక్ గెహ్లాట్ మరిన్ని విమర్శలు గుప్పిస్తూ, ప్రజాస్వామ్యంలో చర్చలనేవి నిరంతర ప్రక్రియ అని, అదే జరిగితే ఎలాంటి నిరసనలు చోటుచేసుకోవని, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-04T21:44:13+05:30 IST