ఆష్టన్ అగర్ హ్యాట్రిక్.. తొలి టీ20లో 107 పరుగులతో ఓడిన సఫారీలు

ABN , First Publish Date - 2020-02-22T21:40:05+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది

ఆష్టన్ అగర్ హ్యాట్రిక్.. తొలి టీ20లో 107 పరుగులతో ఓడిన సఫారీలు

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ 42, స్టీవ్ స్మిత్ 45, అలెక్స్ కేరీ 27  పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 18, మిచెల్ మార్ష్ 19 పరుగులు చేశారు. 


అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆష్టన్ అగర్ దెబ్బకు విలవిల్లాడింది. 14.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలి వందకు పైగా పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో 8 మంది ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఎనిమిదో ఓవర్ వేసేందుకు అగర్ బంతి అందుకున్నప్పుడు దక్షిణాఫ్రికా స్కోరు 42/4. ఆ ఓవర్ పూర్తయ్యాక 44/7 మారి ఓటమి అంచుల్లోకి చేరుకుంది. ఆ ఓవర్లో అగర్ చివరి మూడు బంతుల్లో.. డుప్లెసిస్ (24), ఫెహ్లుక్వాయో (0), డేల్ స్టెయిన్ (0)లను వెనక్కి పంపి హ్యాట్రిక్ సాధించాడు. మొత్తంగా ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.


సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో డుప్లెసిస్ చేసిన 24 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కగిసో రబడ 22 పరుగులు చేశాడు. ఆడం జంపా, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశాడు. హ్యాట్రిక్‌తో సఫారీల వెన్ను విరిచిన అగర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2020-02-22T21:40:05+05:30 IST