అస్లాం మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-24T06:34:01+05:30 IST
అస్లాం మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేపట్టాలి
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్
వన్టౌన్, జనవరి 23: స్థానిక మహంతిపురంలో ఇటీవల మృతిచెందిన వ్యాపారి అస్లాం ఆత్మకు శాంతి కలగాలని, ఆయన మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ నుంచి పంజా సెంటర్ వరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోతిన మహేశ్ మాట్లాడుతూ.. ఈ కేసులో అనుమానితులందరినీ విచారణ చేయాలని, నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించేలా పోలీసుల చర్యలు ఉండాలని సూచించారు. అస్లాం మృతి విషయంలో న్యాయం జరిగేంత వరకూ తాము అండగా ఉంటామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులకు శిక్ష పడేలా చేయాలన్నారు. టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి ఫతావుల్లా మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ యువజన నాయకుడు దాడి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్, ఎంఐఎం నాయకుడు సమీర్, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు కనిశెట్టి లక్ష్మణరావు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కె.గంగాధరరెడ్డి, రెడ్డిపల్లి గంగ, వైసీపీ నాయకులు దాడి జగన్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.