ఆస్తి కోసం అన్న, అక్కను నరికేశాడు

ABN , First Publish Date - 2021-03-08T09:38:02+05:30 IST

ఆస్తి తగాదాల నేపథ్యంలో తోడబుట్టిన అక్కను, అన్నను హతమార్చాడో ప్రబుద్ధుడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ రామచంద్రపురంలో

ఆస్తి కోసం అన్న, అక్కను నరికేశాడు

సిక్కోలు జిల్లాలో  ఘాతుకం


రణస్థలం, మార్చి 7:  ఆస్తి తగాదాల నేపథ్యంలో తోడబుట్టిన అక్కను, అన్నను హతమార్చాడో ప్రబుద్ధుడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన గొర్లె సన్యాసిరావు(60),  గొర్లె రామకృష్ణ, గొర్లె లక్ష్మి, గొర్లె జయమ్మ(55) అన్నాచెల్లెళ్లు. సోదరులిద్దరికీ వివాహాలై పిల్లలున్నారు. లక్ష్మి, జయమ్మ అవివాహితులు. వీరు తల్లిదండ్రుల వద్దే ఉండేవారు. తల్లిదండ్రులు ఇటీవల చనిపోవడంతో అన్న సన్యాసిరావు చేరదీశాడు. కాగా, ఆడపిల్లలకు తల్లిదండ్రులు వాటాగా ఇచ్చిన ఇల్లు, కొంత భూమి ఇటీవల కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం భూసేకరణలో పోయాయి. వాటికి సంబంధించిన నష్టపరిహారం ఇటీవల వచ్చింది. అప్పటి నుంచి ఈ కుటుంబంలో విభేదాలు రాజుకున్నాయి.


ఆడపిల్లలకు వచ్చిన పరిహారాన్ని తనకు ఇవ్వకుండా తన అన్న సన్యాసిరావే తీసుకుంటున్నాడని తమ్ముడు రామకృష్ణ పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో సన్యాసిరావుపై రామకృష్ణ మెడపై కత్తితో నరికేశాడు. అది చూసిన అక్క జయమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి తమ్ముడిని అడ్డుకోబోగా.. ఆమెను కూడా రామకృష్ణ నరికి చంపేశాడు. సన్యాసిరావును కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రామకృష్ణ  నేరుగా జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి  లొంగిపోయాడు. 

Updated Date - 2021-03-08T09:38:02+05:30 IST