యువకుడిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-08-03T05:42:31+05:30 IST

నగరంలోని దమ్మలవీధికి చెందిన మాగుపల్లి రామకృష్ణపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

యువకుడిపై కత్తితో దాడి
చికిత్స పొందుతున్న రామకృష్ణ

  పరిస్థితి విషమం ఫ బాధితుడి వాంగ్మూలం తీసుకున్న

 అదనపు సివిల్‌ జడ్జి    పోలీసుల అదుపులో నిందితుడు


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 2: నగరంలోని దమ్మలవీధికి చెందిన మాగుపల్లి రామకృష్ణపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీ వ్రంగా గాయపడిన రామకృష్ణ పరిస్థితి విషమంగా మారింది. దీంతో అదనపు సివిల్‌ జడ్జి.. ఆస్పత్రికి వెళ్లి బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే.. దమ్మలవీధికి చెందిన రామకృష్ణ పండ్లవ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు సురేంద్రతో పాటు మరి కొంతమందితో కలసి రామకృష్ణ దమ్మలవీధి చివరన ఆంజనేయ విగ్రహం సమీపంలో కూర్చున్నాడు. కొంతసేపటి తరువాత మంచినీళ్ల సీసా కోసం బయటకు వచ్చిన రామకృష్ణను.. అటుగా వెళ్తున్న రవి అనే వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో రవి తన స్నేహితుడు శివను కత్తి తీసుకురావాలని పురమాయించాడు. శివ వెళ్లి కత్తి తీసుకొని రాగా దాన్ని రవి అందుకుని విచక్షణా రహితంగా రామకృష్ణను పొడిచేశాడు. కడుపులో బలంగా పొడవడంతో పేగులు బయటకు వచ్చేశాయి. గుండె, వీపు, తల, కాళ్లు, చేతులపై కత్తితో పొడిచేశాడు. దీంతో  రామకృష్ణ కుప్పకూలిపోయాడు. అక్కడినుంచి రవి, శివ పరారయ్యారు. పరిస్థితిని గమనించిన రామకృష్ణ స్నేహితుడు సురేంద్ర స్థానికులకు సమాచారం అందించారు. అటుగా వస్తున్న గనగళ్ల మూర్తి.. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణను చూసి ఆటోలో ప్రభుత్వసర్వజన ఆసుపత్రికి తరలించారు. సోమవారం పరిస్థితి విషమంగా మారింది. దీంతో అదనపు సివిల్‌ జడ్జి రాణి.. ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణనుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. రామకృష్ణను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిందితులు రవి, శివలు గంజాయి, మద్యం మత్తులో ఉన్నట్లు సమా చారం.  రవిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలపై ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-08-03T05:42:31+05:30 IST