తెలంగాణలో ఈ జిల్లాల్లో 96శాతం ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగాయ్..
ABN , First Publish Date - 2022-01-14T18:12:34+05:30 IST
తెలంగాణలో ఈ జిల్లాల్లో 96శాతం ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగాయ్..
- నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 2021లో 44,278 ఆస్తుల రిజిస్ర్టేషన్ జరిగిందని, గతంతో పోల్చితే ఇది 96శాతం అధికంగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. అయితే డిసెంబర్ నెలలోనే రిజిస్ర్టేషన్లు 0.5శాతం తగ్గాయి. 2020 డిసెంబర్ నెలలో 3,957 ఆస్తులు రిజిస్ర్టేషన్ జరగ్గా, 2021 డిసెంబర్ నెలలో 3,931 ఆస్తులు మాత్రమే రిజిస్ర్టేషన్లు జరిగాయి. అయితే మూడు జిల్లాలో 0.5శాతం రిజిస్ర్టేషన్లు తగ్గినా కానీ, హైదరాబాద్ జిల్లాలో 11శాతం మేర రిజిస్ర్టేషన్లలో వృద్ధి నమోదైంది.
అయితే 2020లో రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాల వాటా 27శాతం ఉండగా, 2021లో ఆ వాటా 30శాతానికి పెరిగింది. ఈ మూడు జిల్లాలో రిజిస్ర్టేషన్ జరిగిన రెసిడెన్షియల్ అమ్మకాలలో 60శాతం రూ.50లక్షల్లోపు ఉన్నట్లు అంచనా వేశారు. రూ.25లక్షల నుంచి రూ.50లక్షల పరిధిలోని ఆస్తుల వాటా డిసెంబర్ 2020తో పోల్చితే 2021డిసెంబర్ మెరుగుపడింది. రూ.25లక్షల కంటే తక్కువ కేటగిరిలో రిజిస్ర్టేషన్లు 2020 డిసెంబర్తో పోల్చితే 2021 డిసెంబర్లో గణనీయంగా తగ్గిందని వెల్లడించింది.