జాతీయ రహదారి నిర్మాణానికి సహకరించాలి
ABN , First Publish Date - 2021-08-02T05:28:46+05:30 IST
శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి కోరారు.
శ్రీకాళహస్తి అర్బన్, ఆగస్టు 1: శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి కోరారు. కాగా, రహదారి విస్తరణకుగాను శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లెకు చెందిన 25మంది రైతుల భూముల సేకరణకు అధికారులు నోటీసులు జారీచేశారు. వీటిని స్వీకరించకుండా పరిహారం పెంచాలని బాధితులు వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను బుజ్జగించేందుకు ఆర్డీవో రంగంలోకి దిగారు. ఆదివారం చెర్లోపల్లె రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ... భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం మంచి పరిహారం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. చెర్లోపల్లె మినహా రహదారి నిర్మాణానికి అడ్డంకులులేవనీ, ఇందుకు రైతులు సహకరిస్తే పనులు వేగవంతమవుతాయని గుర్తుచేశారు. అనంతరం పనులకు ఆమోదిస్తూ ఆయన రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.