రూ.22.50 లక్షల కోట్ల ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-04-09T06:30:58+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని దేశీయ పారిశ్రామిక, వాణిజ్య మండళ్లు ప్రభుత్వాన్ని కోరాయి. లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా...

రూ.22.50 లక్షల కోట్ల ప్యాకేజీ

  • ప్రభుత్వానికి అసోచామ్‌ సూచన 


ముంబై/న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని దేశీయ పారిశ్రామిక, వాణిజ్య మండళ్లు ప్రభుత్వాన్ని కోరాయి. లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఈ సంక్షోభం నుంచి కోలుకోవాలంటే అసాధారణ స్థాయిలో ఉద్దీపనలు తప్పనిసరని ఆర్థికవేత్తలంటున్నారు. కరోనా కష్టాల నుంచి పేదలు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అందులో రూ.73, 000 కోట్ల విలువైన ప్రకటనలే కొత్తవని ఆర్థికవేత్తలంటున్నారు. పైగా గత ప్యాకేజీలో పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ఆర్థికంగా లభించిన ఊరటేంలేదని వారన్నారు. తమ కోసమూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి. కాగా, కోవిడ్‌ ప్రభావానికి లోను కాని 400 జిల్లాల్లో ఆర్థిక కార్యకాలాపాలు పునరుద్ధరించాలని పీహెచ్‌ డీసీసీఐ సూచించింది.


ఉదారంగా ఉద్దీపనలు

ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఎదుర్కోబోతున్న తరుణంలో ఆర్థిక సాయం అదే స్థాయిలో ఉండాలని అసోచామ్‌ అభిప్రాయపడింది. వచ్చే 12-18 నెలల్లో కనీసం 20,000 కోట్ల డాలర్ల (రూ.15 లక్షల కోట్లు) నుంచి 30,000 కోట్ల డాలర్ల (రూ.22.50 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీ కల్పించాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ కోరారు. 


పేదలు, అసంఘటిత రంగ వర్గాలకు అదనపు మద్దతు అవసరం. వారి జన్‌ధన్‌ ఖాతాల్లో మరో రూ.2 లక్షల కోట్లు నగదు జమ చేయాలి. పరిశ్రమలకు నిర్వహణ మూలధన రుణ పరిమితిని పెంచాలి.  ఎంఎ్‌సఎంఈల టర్మ్‌ రుణాలను పునర్వ్యవస్థీకరించాలి.   

- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)


Updated Date - 2020-04-09T06:30:58+05:30 IST