ఎట్టకేలకు ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2022-08-22T05:54:29+05:30 IST
ఎట్టకేలకు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది.
- ఈ నెల 29న కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించినున్న సీఎం కేసీఆర్
- లక్షా 25 వేల మందితో బహిరంగసభ
- సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కొప్పుల, గంగుల
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎట్టకేలకు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 29న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భవనాన్ని ఆరంభించనున్నారు. అనంతరం లక్షా 25 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లతో నిమగ్నమయింది. సుమారు 52 కోట్ల వ్యయంతో రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న పెద్ద కల్వల వద్ద శ్రీరాం సాగర్ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం ఆవరణలో గల 21 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. దీనికి సుమారు 52 కోట్ల రూపాయలను వెచ్చించారు. వాస్తవానికి గత ఏడాది అక్టోబరు, నవంబరు మాసాల్లోనే భవన సముదాయాన్ని సీఎం ఆరంభిస్తారని ఎదురుచూశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ రావడంతో వాయిదా పడింది. కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారని భావించారు. ఇటీవల వికారాబాద్ కలెక్టరేట్ భవనం ఆరంభించడంతో ఇదే నెలలో జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని కేసీఆర్ ఆరంభించడంతో ఇదే నెలలో పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభమవుతుందని ఆశించారు. ఎట్టకేలకూ ముహూర్తం ఖరారు అయింది. భవనం ఆరంభించిన అనంతరం మంథనికి వెళ్లే రహదారిలోగల ఖాళీ స్థలంలో లక్షా 25 వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మంథనికి వెళ్లే రహదారిలో గల ఖాళీ స్థలాన్ని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, సీపీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, తదితరులు పరిశీలించారు. అయితే సీఎం టూర్కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇంకా రాలేదని అధికారులు తెలిపారు.