ఆక్సిజన్ కోసం 6.9 లక్షల కరోనా బాధితుల ఎదురుచూపు!
ABN , First Publish Date - 2021-05-05T12:14:21+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో....
న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తలెత్తుతోంది. ఆక్సిజన్ బెడ్ల కోసం ఎదురు చూస్తున్నామంటూ సోషల్ మీడియాలో సందేశాల వెల్లువ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి, పంపిణీపై కేంద్ర ప్రభుత్వం చురుకుగా చర్యలు చేపడుతోంది. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చూస్తే... ప్రస్తుతం దేశంలో సుమారు 6.9 లక్షల మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అవసరం ఉంది. అయితే అందరికీ ఒకే సమయంలో ఆక్సిజన్ అవసరం లేదని, గరిష్ట కేసులను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మీడియాకు అందిన నివేదిక ప్రకారం కేంద్రం కరోనా బాధితులు, వారికి ఆక్సిజన్ సరఫరాపై రూపొందించిన ప్రణాళికలో మూడు వర్గాలుగా విభజించింది. వీటిలో మొదటిది ఆక్సిజన్ అవసరం లేని 80 శాతం తేలికపాటి కేసులు. రెండవది 17 శాతం... ఇది మితమైన కేసుల వర్గంలోకి వస్తుంది. వీరికి చికిత్స సమయంలో ఆక్సిజన్ అవసరం కావచ్చు. ఇక మూడవ వర్గం... తీవ్రమైన కేసులు.... ఇది మూడు శాతం... వీరికి వెంటిలేటర్లు అవసరం. మే 3 నాటికి, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 34.4 లక్షలుగా ఉంది. వీటిలో ఆక్సిజన్ అవసరమయ్యే కేసులు 20 శాతం ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో దేశంలో మొత్తం 8,462 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవసరమని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది.