మూడేళ్లయినా..!
ABN , First Publish Date - 2021-08-04T04:51:58+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించినా అసలు ఉద్దేశాన్నే విస్మరించడంతో అభాసుపాలవుతోంది. సమితుల్లోని సభ్యులకు ఎలాంటి బాధ్యతలు, విధులు అప్పజెప్పలేదు.
- రైతులకు ఉపయోగం లేని రైతు సమన్వయ సమితులు
- మూడేళ్లు గడుస్తున్నా విధులు, నిధులపై స్పష్టత కరువు
- రైతు సమన్వయ సమితిని రైతు బంధు సమితిగా మార్చిన పేరు
- రైతులకు సలహాలు సూచనలు అందక నీరుగారుతున్న లక్ష్యం
- ఉమ్మడి జిల్లాలో చాలా వరకు తెరుచుకోని రైతు వేదికలు
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించినా అసలు ఉద్దేశాన్నే విస్మరించడంతో అభాసుపాలవుతోంది. సమితుల్లోని సభ్యులకు ఎలాంటి బాధ్యతలు, విధులు అప్పజెప్పలేదు. రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): ప్రభుత్వానికి, రైతులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి సమన్వయం పరిచేందుకు మూడేళ్ల క్రితం సర్కారు ఎంతో ఆర్భాటంగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందంతా బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైనప్పటి నుంచి సమితుల్లోని సభ్యులకు ఎలాంటి బాధ్యతలు, విధులు అప్పజెప్పలేదు. అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతున్నా వారిద్వారా రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. రైతు సమన్వయ సమితులను చివరకు రైతుబంధు సమితులుగా పేరు మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 47 మండలాల్లో మండల సమన్వయ సమితి, 1,058 గ్రామాల్లో గ్రామ సమన్వయ సమితుల కోఆర్డినేటర్లను నామినేటెడ్ పద్ధ్దతిలో నియమించారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ను నియమించారు. రైతు సమన్వయ సమితులకు సంబంధించిన విధివిధానాలతో ఆగస్టు 27న జీవో 39ని జారీ చేసింది. ప్రభుత్వ నామినేటెడ్ ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతుసమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అప్పట్లో ఆ జీవోలో పేర్కొన్నారు. దానిప్రకారం గ్రామ రెవెన్యూ స్థాయిలో 15 మంది, మండల స్థాయిలో 24 మంది, జిల్లాస్థాయిలో 24 మంది, రాష్ట్ర స్థాయిలో 42 మంది సభ్యులతో రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమితులకు ప్రభుత్వం నామినేటెడ్ పద్దతిలో ఒక సమన్వయ కర్త (కోఆర్డినేటర్)ను నియమించింది.
- రైతుబంధు సమితులుగా పేరు మార్చి..
ప్రభుత్వం అన్ని రకాల అధికారాలు కట్టబెడుతుందన్న ప్రచారం జరిగింది. రైతుబంధు పథకం, రైతుబీమా, గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పనిచేస్తారని, పంటలకు గిట్టుబాటు ధరలు, క్రాప్కాలనీల ఏర్పాటు, వంటి వాటిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రూ. 500 కోట్లతో రైతునిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. దీంతో రైతు సమన్వయ సమితుల్లో స్థానం కోసం అప్పట్లో భారీగానే పోటీ నెలకొంది. ఇప్పటి వరకు మూడేళ్లు గడిచినా ఎలాంటి బాధ్యతలను అప్పగించక పోగా... రైతుసమన్వయ సమితుల పేరు తొలగించి రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
- ఎవరిదారి వారిదే..
వ్యవసాయ శాఖ అధికారులతో రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా, ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారి సమన్వయ సమితి సభ్యులు వ్యవసాయశాఖతో సమన్వయం చేయలేక పోతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాల్సిన సభ్యులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేరుకే గ్రామ, మండల, జిల్లా సమితి కో-ఆర్డినేటర్లుగా చలామని అవుతున్న వీరు రైతు సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు.
- అలంకార ప్రాయంగా...
రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయంగా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణం దాదాపు పూర్తయినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చోట్ల రైతువేదికలు ప్రారంభానికి నోచుకోలేదు. వ్యవసాయంలో ఆధునిక పద్ధ్దతులను అనుసరించేందుకు అవసరమయ్యే పరిజ్ఞానం అందించాల్సి ఉంటుంది. ఇవేమి రైతులు తెలుసుకోలేకపోతున్నారు. రైతు వేదికలో అన్నదాతలకు అవసరమైన టీవీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ వంటి సామగ్రిని సమకూర్చలేరు.
- కనిపించని సేవలు..
రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు సమన్వయ సమితి సభ్యులు అవసరమైన సేవలను అందించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు, వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో రైతు వేదికలు
రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మొత్తం
రైతు వేదికలు 83 99 09 191
ఉమ్మడి జిల్లాలో గ్రామ, మండల రైతు సమన్వయ సమితులు
గ్రామ రైతు సమన్వయ సమితులు 475 482 101 1,058
మండల రైతు సమన్వయ సమితులు 23 18 06 47
నిధుల్లేవ్.. విధుల్లేవ్
రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత వ్యవసాయరంగానికి చెందిన వాటిపై సబ్సిడీలు ఇవ్వడం లేదు. షాద్నగర్ ప్రాంతంలో ఎక్కువగా హర్టికల్చర్ (వివిధ రకాల తోటలు)కు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే సబ్సిడీలు ఇస్తున్నారు. మిగతా రైతులకు ఇవ్వడం లేదు. పామాయిల్ తోటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్ తోటలకు సబ్సిడీ లేదని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. కనీసం తమకంటూ ఒక కార్యాలయం కూడా లేదు. - వెంకటేశ్వరరెడ్డి, ఫరూక్నగర్ మండల రైతుసమన్వయ సమితి కో-ఆర్డినేటర్
కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాం
జిల్లా కోఆర్డినేటర్తో పాటు మండల కో-ఆర్డినేటర్లు, గ్రామ కో-ఆర్డినేటర్లను ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే పలు మార్లు శిక్షణ అందించడం జరిగింది. రైతుసమన్వయ సమితులను రైతుబంధు సమితులుగా పేరు మార్చడం జరిగింది. నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎంపిక చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అనేది ప్రభుత్వం నిర్ణయించలేదు. ప్రస్తుతం రైతుబంధు సమితులు జిల్లాలో పనిచేస్తున్నాయి.
- గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి