అరగంటలో 1500 కిలోల చేపలు మాయం!
ABN , First Publish Date - 2021-06-24T10:04:59+05:30 IST
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1500 కిలోల చేపల్ని జనాలు అరగంటలో మాయం చేసేశారు. బోల్తా పడిన చేపల వాహనం నుంచి దొరికిన చేపను దొరికినట్లు పట్టుకెళ్లిపోయారు.
- వాహనం బోల్తా.. తీసుకెళ్లిన స్థానికులు
- నిషేధిత క్యాట్ఫిష్ అని తెలిసి పారబోత
చౌటుప్పల్ రూరల్, జూన్ 23: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1500 కిలోల చేపల్ని జనాలు అరగంటలో మాయం చేసేశారు. బోల్తా పడిన చేపల వాహనం నుంచి దొరికిన చేపను దొరికినట్లు పట్టుకెళ్లిపోయారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి శివారు నుంచి కర్ణాటకలోని బీదర్కు నిషేధిత క్యాట్ఫిష్ చేపల లోడుతో వెళుతున్న వాహనం గ్రామ శివారులో రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో వాహనాన్ని వదిలేసి డ్రైవర్, అతడి సహాయకుడు పరారయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంచులు, బకెట్లలో చేపలను తీసుకెళ్లిపోయారు. అరగంటలోనే చేపలన్నింటినీ ఖాళీ చేసేశారు. అనంతరం.. అవి నిషేధిత చేపలు అని తెలిసి, చాలామంది రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు.