అట్లాంటా ప్రజలకు పోలీసుల అభ్యర్థన..!

ABN , First Publish Date - 2021-04-12T01:07:10+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల తరచూ తుపాకుల దాడులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అట్లాంటా ప్రజలకు పోలీసుల అభ్యర్థన..!

అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల తరచూ తుపాకుల దాడులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఈ గన్ కల్చర్ అంతకంతకూ పెరిగిపోతోంది. దుండగులు జన సమూహల్లో విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ తుపాకుల సంస్కృతిని 'అంటువ్యాధి'తో పోల్చారు. దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రజలు దూరం చేసుకోవాలని బైడెన్ కోరారు. అలాగే ఈ కల్చర్‌ను అంతమొందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓ అధికారిని సైతం నియమించారు. ఇలా తుపాకీ సంస్కృతిపై బైడెన్ ఉక్కుపాదం మోపుతున్నారు.


ఇదిలాఉంటే.. అట్లాంటాలో మార్చి 16న ఓ దుండగుడు ఆసియన్ల మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడికి తెగబడడంతో ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆరుగురు ఆసియా మహిళలు కూడా ఉన్నారు. ఇదే కోవలో మార్చి నెలలలో పలు చోట్ల కాల్పులు, ఆసియన్ అమెరికన్లపై దాడులు కలకలం సృష్టించాయి. దీంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏకంగా 60 శాతం హత్య కేసులు పెరిగిపోయినట్లు అట్లాంటా పోలీస్ విభాగం వెల్లడించింది. ఒక్క అట్లాంటాలోనే జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ తరహా కేసులు మొత్తం 167 నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అట్లాంటా పోలీస్ విభాగం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఓ అభ్యర్థన చేసింది. ప్రజలు తప్పకుండా మా అభ్యర్థనను గమనిస్తారని ఆశిస్తున్నట్లు అట్లాంటా పోలీస్ విభాగం చీఫ్ రోడ్నీ బ్రయంట్ అన్నారు. పోలీసుల సందేశంలో ఏముందంటే.. "కాల్పులు ఆపేయండి ప్లీజ్. కోపం, తుపాకులు కలిస్తే మంచి జరగదు. తుపాకీ పట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి." అంటూ రాసుకొచ్చారు. దీన్ని సూచించేలా అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ ఫొటోను సైతం పోస్ట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-04-12T01:07:10+05:30 IST