కొనసాగుతున్న కల్లోలం
ABN , First Publish Date - 2021-05-08T06:38:16+05:30 IST
జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
కొత్తగా 1779 మందికి కరోనా
మరో ఇద్దరు బలి
కొవిడ్ కేంద్రాల్లో బాధితులకు కౌన్సిలింగ్
ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు
అనంతపురం వైద్యం, మే7: జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 1779 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి మరో ఇద్దరు బలైపోయారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 94997కి చేరింది. ఇందులో 80101 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 711 మంది మరణించారు. ప్రస్తుతం 14185 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో యాక్టివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొవిడ్ ఆసత్రులు, కేర్సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా బాధితులకు సకాలంలో బెడ్లు దొరక్క, దొరికినా వసతులు లేక, సరైన వైద్య సేవలు అందక అనేక కష్టాలు పడుతున్నారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఆక్సిజన్ అందక చికిత్సలు సకాలంలో అందక కొందరు చనిపోతున్నారు. అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన వారు తీవ్ర ఆందోళన, టెన్షన్కు లోనవుతున్నారు. భయంతోనే అనేక మంది చనిపోతున్నారని వైద్య వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ సెంటర్లలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం సోషల్ కౌన్సిలర్లు, ఎన్జీఓల ద్వారా మోటివేషనల్ సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ పద్మావతి ఈ సెషన్స్ ఏర్పాటు చేసి బాధితుల్లో ఆత్మస్థయిర్యం పెంచుతున్నారు. కలెక్టర్, జేసీలు.. ఆమెను అభినందించారు.
కొత్త కేసుల నమోదు ఇలా..
జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3954 శాంపిల్స్ పరీక్షించారు. ఇందులో 1779 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అనంతపురంలో 283, కదిరి 135, ధర్మవరం 122, హిందూపురం 109, కళ్యాణదుర్గం 97, గుత్తి 87, గుంతకల్లు 72, మడకశిర 70, బత్తలపల్లి 68, పుట్టపర్తి 64, అగళి 39, కొత్తచెరువు 38, తలుపుల 36, ఓడీసీ, రాప్తాడు, యాడికి 33, పెద్దవడగూరు, తనకల్లు 29, పెనుకొండ 27, శెట్టూరు, తాడిమర్రి 26, గార్లదిన్నె, ముదిగుబ్బ, నల్లమాడ 25, ఆమడగూరు 23, ఎన్పికుంట 22, గుదిబండ, చిలమత్తూరు 18, బెలుగుప్ప 16, కూడేరు 15, లేపాక్షి 13, సీకేపల్లి, సోమందేపల్లి 12, పుట్లూరు 9, కుందుర్పి, ఆత్మకూరు, తాడిపత్రి 8, గాండ్లపెంట, శింగనమల 7, కనగానిపల్లి 3, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, పెద్దపప్పూరు 2, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, గోరంట్ల, గుమ్మఘట్ట, రామగిరి, రాయదుర్గం, రొద్దం, విడపనకల్లు, యల్లనూరు మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన ఒకరు వైరస్ బారిన పడ్డారు. మొత్తం 54 మండలాల్లో వైరస్ ప్రభావం కొనసాగింది.