వైసీపీ రంగులు చెరిపేయండి: తెలుగు మహిళలు
ABN , First Publish Date - 2020-09-23T08:28:05+05:30 IST
నగరంలోని వార్డు సచివాలయాలపై ఉన్న వైసీపీ రంగులను వెంటనే తొలగించాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
అనంతపురం కార్పొరేషన్, సెప్టెంబరు 22: నగరంలోని వార్డు సచివాలయాలపై ఉన్న వైసీపీ రంగులను వెంటనే తొలగించాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీ ఆధ్వర్యంలో నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక కార్పొరేషన్ స్థలాలున్నా కేవలం కమ్యునిటి హాళ్లనే సచివాలయ కార్యాలయాలుగా మార్చడం కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు.
డ్వాక్రా మహిళల సమావేశాలకోసం అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కమ్యునిటి భవనాలను నిర్మించారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతరువాత వాటిని వార్డు సచివాలయాలుగా మార్చారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు స్వప్న, సుజాత, వడ్డెవాణి, దేవి, కృష్ణవేణి, మణిమ్మె పాల్గొన్నారు.