వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్ర
ABN , First Publish Date - 2020-09-23T08:37:33+05:30 IST
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బిల్లులను చర్చ కూడా లేకుండానే ఆమోదింపజేసుకుందని సీపీఎం నేతలు మండిపడ్డారు.
వ్యవసాయ బిల్లులను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి: సీపీఎం
అనంతపురం టౌన్, సెప్టెంబరు 22: వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బిల్లులను చర్చ కూడా లేకుండానే ఆమోదింపజేసుకుందని సీపీఎం నేతలు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో మం గళవారం స్థానిక క్లాక్టవర్ వద్ద ఆందోళన చేపట్టారు. రైతులను గొలుసులతో కట్టేసి లాక్కొస్తూ.. బిల్లుల ప్రతులను దహనం చేసి, నిరసన వ్యక్తంచేశారు. జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కి, వారి ఎంపీలను సస్పెండ్ చేసి వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు.
కేంద్రమంత్రి రాజీనామా చేసినా పట్టించుకోకుండా, కనీసం చర్చ కూడా లేకుండానే దేశ రైతాంగం పట్ల మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఈ బిల్లులకు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి మద్దతివ్వటం దారుణమన్నారు. జనసేన పార్టీ.. బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచేందుకే వీరంతా ఏకమైనట్లుందన్నారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా అంద రూ సమష్టిగా ఉద్యమిస్తే తప్పా రైతును కాపాడుకోలేమన్నారు.
వ్యవసాయాన్ని ప్రైవేట్ మార్కె ట్ల శక్తుల చేతుల్లో పెట్టి, నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించటం వల్ల ధరల నియంత్రణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందన్నారు. ఒకే దేశం-ఒకే మార్కెట్ పేరుతో రైతుకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందన్నారు. ఈవిధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు నాగేంద్రకుమార్, నల్లప్ప, జిల్లా కమిటీ నాయకులు గోపాల్, రామిరెడ్డి, రామాంజనేయులు, ఆంజనేయులు, రమేష్, ఆవాజ్ నాయకుడు వలి, కేవీపీఎస్ నగర నాయకులు జీవా, వెంకటేష్, రాజా, ఎస్ఎ్ఫఐ నాయకులు పరమేష్, సూర్యచంద్రయాదవ్, నాగప్ప, వన్నూరప్ప పాల్గొన్నారు.