కులంపేరుతో దూషించిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు
ABN , First Publish Date - 2021-10-20T05:07:05+05:30 IST
ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.
హవేళీఘణపూర్, అక్టోబరు 19: ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బ్యాతోల్లో గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో యువతికి సంబంధించిన వీడియోను ఓ యువకుడు పోస్టు చేశాడు. దానిని డిలీట్ చేయాలని అదే గ్రామానికి చెందిన ఆశ రాజు(ఎల్లయ్య) ఆ యువకుడికి సూచించాడు. ఈ మేరకు వీడియోను ఆ యువకుడు డిలీట్ చేశాడు. అనంతరం ఆశ రాజు ఆ వీడియోను తీసివేయించాడని ఆ యువకుడు పరశురాంగౌడ్ అనే వ్యక్తికి చెప్పాడు. ఈ విషయమై కక్షగట్టిన పరశురాంగౌడ్ ఆశరాజును మండలపరిధిలోని తీన్ నంబర్ గేటు వద్దకు తీసుకెళ్లి కులం పేరుతో దూషించాడు. ఆపై దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు సోమవారం రాత్రి హవేళీఘణపూర్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మెదక్ డీఎస్పీ సైదులు, ఎస్ఐ శేఖర్రెడ్డి బ్యాతోల్ గ్రామంలో విచారణ జరిపి పరశురామ్గౌడ్తో పాటు మరో ఆరుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నట్టు వారు తెలిపారు.