వేలాదిమంది మహిళలకు గర్భస్రావాలు
ABN , First Publish Date - 2020-06-30T08:05:27+05:30 IST
ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై చైనా నిశ్శబ్ద మారణహోమాన్ని నిర్వహిస్తోంది. జనాభాను అదుపు చేసేందుకు బలవంతపు నియంత్రణ చర్యలకు దిగుతోంది. ప్రధానంగా ఉయ్ఘర్ ముస్లింలనే చైనా లక్ష్యంగా చేసుకుంది. ఒక వార్తాసంస్థ చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి...
- ఉయ్ఘర్ ముస్లింలపై చైనా దారుణాలు
- జనాభా నియంత్రణకు బలవంతపు చర్యలు
- హాన్ సంస్కృతిలోకి మారాలంటూ పరోక్ష ఒత్తిడి
బీజింగ్, జూన్ 29: ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై చైనా నిశ్శబ్ద మారణహోమాన్ని నిర్వహిస్తోంది. జనాభాను అదుపు చేసేందుకు బలవంతపు నియంత్రణ చర్యలకు దిగుతోంది. ప్రధానంగా ఉయ్ఘర్ ముస్లింలనే చైనా లక్ష్యంగా చేసుకుంది. ఒక వార్తాసంస్థ చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ నివేదిక ప్రకారం.. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే షిన్జియాంగ్ ప్రాంతంలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడి మహిళలతో జనాభా నియంత్రణ పరికరాల్ని(ఐయూడీ) అధికారులు బలవంతంగా వాడిస్తున్నారు. వేలాది మంది మహిళలకు గర్భస్రావం చేయిస్తున్నారు. మైనారిటీలు ముగ్గురు వరకూ పిల్లల్ని కనవచ్చు. అయినా సరే.. ముగ్గురు లేదా ఆపై పిల్లల్ని కంటే, ముస్లింలకు అధికారులు భారీ జరిమానాల్ని విధిస్తున్నారు. చెల్లించకపోతే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని వేరుచేసి బలవంతంగా నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నారు.
ఉయ్ఘర్ ముస్లింలు ఎక్కువగా ఉండే హొతాన్, కాష్గర్ ప్రాం తాల్లో 2015-18 మధ్యకాలంలో జననాల శాతం 60శాతానికి పైగా పడిపోయింది. షిన్జియాంగ్లో ముస్లిం జనాభాను అదుపుచేయడం కోసం చైనా వేలాది కోట్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. హాన్ సంస్కృతినే అనుసరించాలంటూ ముస్లింలపై ప్రభుత్వం పరోక్ష ఒత్తిడి తీసుకొస్తోంది. అందుకోసం నిర్బంధ కేంద్రాల్లో వారికి రాజకీయ, మతపరమైన బోధనల్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.