బాబుపై రాళ్లదాడి అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2021-04-14T06:32:49+05:30 IST
రుపతి ప్రచార సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు.
కనిగిరిలో టీడీపీ నిరసన
కనిగిరి, ఏప్రిల్ 13 : తిరుపతి ప్రచార సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. కనిగిరిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దఎత్తు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దాడి అప్రజాస్వామికమని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడికి నిరసనగా మంగళవారం పట్టణంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రమంతా అరాచకం తాండవిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. గడిచిన రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోయినా, అరాచకాలు, పేదలపై దాడులు, దుర్మార్గాలు పెచ్చురిల్లాయన్నారు. తిరుపతిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిరంజీవి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, అంజుమన్ కమిటీ మాజీ నాయకుడు, రోషన్ సందాని తదితరులు మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొలుత స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక పామూరు బస్టాండ్ కూడలిలో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాయం తిరుపతిరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, పట్టణ టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు ఫిరోజ్, టీడీపీ ముస్లీం మైనార్టీ నాయకులు జంషీర్ అహ్మద్, కాపు నాయకులు గండికోట రమేష్, కాసుల శ్రీరాములు, మూలే బాలిరెడ్డి, బారా ఇమాం, పెన్నా కొండలు, బుజ్జా, పాలూరి సత్యం, చిన్న రామిరెడ్డి, షెడ్రక్, బుడ్డెం గౌస్, ఎల్వీఆర్, నరసింహస్వామి, లక్ష్మణరావు, బాల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిమానం ఓర్వలేకే రాళ్లదాడి
లింగసముద్రం : తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో టీడీపీపై ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానాన్ని వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్ షోలో రాళ్ల దాడి చేయించారని టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ వీరబాబు, ఆ పార్టీ నాయకులు సీహెచ్ వెంకటప్రసాద్, కిలారి మాలకొండయ్యలు మంగళవారం పేర్కొన్నారు. వైసీపీ నాయకులు రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వారు విమర్శించారు.