రెచ్చిపోయిన ఇసుకాసురులు

ABN , First Publish Date - 2021-10-24T07:25:55+05:30 IST

ఏర్పేడు మండలం స్వర్ణముఖి నది నుంచి ఇసుక తీసుకువెళ్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న ఎస్‌ఈబీ అధికారులను వాహనాలతో ఢీకొట్టేయత్నం చేశారు.

రెచ్చిపోయిన ఇసుకాసురులు
స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలు

ఎస్‌ఈబీ అధికారులపై తిరగబడి వాహనాలతో ఢీకొట్టేయత్నం


ఏర్పేడు, అక్టోబరు 23: ఏర్పేడు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోయారు. స్వర్ణముఖి నది నుంచి శనివారం ఇసుక తీసుకువెళ్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న ఎస్‌ఈబీ అధికారులను వాహనాలతో ఢీకొట్టేయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ గాయపడగా, ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌ఎ్‌సఐ శ్రీనివాసులు కథనం మేరకు.. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందడంతో శనివారం మోదుగులపాళెం సమీపంలోని స్వర్ణముఖి నదీప్రాంతంలో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక తీసుకు వెళ్తున్న రెండు ట్రాక్టర్లను ఆపి అనుమతులున్నాయా అని అడిగారు. అయితే వాహన డ్రైవర్లు పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. దీంతో వారిని ఆపేయత్నం చేయగా, అధికారులపై తిరగబడ్డారు. ఆపై ఇద్దరు డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతూ వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించి వాహనాలతో పరారయ్యారు. కాగా, ఈ దాడి నుంచి తప్పించుకునేయత్నంలో అక్కడున్న గుంతలోపడి కానిస్టేబుల్‌ ఢిల్లీబాబు గాయపడ్డాడు. క్షతగాత్రుడిని అధికారులు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం అదనపు సిబ్బంది సాయంతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్న మరో రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. దాడి ఘటనపై ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు ఏర్పేడు పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి, అధికారులపై దాడికి పాల్పడిన ట్రాక్టర్ల డ్రైవర్లు, వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-24T07:25:55+05:30 IST