లే అవుట్ ప్లాట్ల కబ్జాకు యత్నిస్తున్నారు..
ABN , First Publish Date - 2021-01-21T06:13:59+05:30 IST
లేఅవుట్ చేసిన ప్లాట్లను కొందరు రియల్టర్లు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మూర్తి, సుబ్రమణ్యం, శ్రీకాంత్రెడ్డి, మల్లేశం తదితరులు ఆరోపించారు.
లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ
రామచంద్రాపురం, జనవరి 20: లేఅవుట్ చేసిన ప్లాట్లను కొందరు రియల్టర్లు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మూర్తి, సుబ్రమణ్యం, శ్రీకాంత్రెడ్డి, మల్లేశం తదితరులు ఆరోపించారు. తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలంటూ బుధవారం వారు తహసీల్దార్ శివకుమార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. బాధితుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం మండలం కొల్లూరులో రూ. వేల కోట్ల విలువైన భూముల్లో మూడున్నర దశాబ్దాల క్రితం గ్రామపెద్దలు లేఅవుట్ చేసి పాట్లను నగరంలోని పలువురు ఉద్యోగులు, చిరు వ్యాపారులు తదితరులకు విక్రయించారు. అయితే కొందరు రియల్టర్లు ఈ లేఅవుట్ ప్లాట్ల కబ్జాకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు బాధితులు వాపోయారు. ఈ ప్లాట్లకు సంబంధించి తాము మూడు దశాబ్దాలుగా ఆందోళన చేస్తూ, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించామన్నారు. అయితే ఇటీవల కొందరు రియల్టర్లు ప్లాట్ల హద్దులను తొలగించి పట్టాదారు పాసుపుస్తకాలను పొందే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో అధికారులు ప్లాట్ సొంతదారులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, కొత్త చట్టం ప్రకారం ప్లాట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తమకు అధికారాలు లేవని తహసీల్దార్ చెప్పారు.