జపాన్లో ఆకర్షణీయంగా వరి సాగు
ABN , First Publish Date - 2021-09-05T17:32:54+05:30 IST
జపాన్ ప్రజల ముఖ్యమైన ఆహారం వరి. 2,000 సంవత్సరాలకుపైగా
చీబా : జపాన్ ప్రజల ముఖ్యమైన ఆహారం వరి. 2,000 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన వరి సాగును నేటికీ సంప్రదాయబద్ధంగా జపనీయులు కొనసాగిస్తున్నారు. చీబా ప్రిఫెక్చర్లోని ఒయమ సెన్మైదా క్షేత్రంలో వరి సాగు విస్తారంగా కనిపిస్తుంది. ఉత్తర జపాన్, దక్షిణ జపాన్ శివారు ప్రాంతాల్లో ‘టనడ’ పేరుతో అందమైన వరి పొలాలు కనిపిస్తాయి.
ఒయమ సెన్మైదాను 2002లో సాంస్కృతిక ప్రకృతి రమణీయ దృశ్యంగా చీబా ప్రిఫెక్చర్ గుర్తించింది. దీనిని ప్రకృతి, ప్రజలు కలిసి సృష్టించారు. పర్వతంపై వరి సాగు క్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానిక రైతులు చెప్పారు. దీనిని సెన్మైదా లేదా టనడ అని పిలుస్తారని చెప్పారు. వర్షపు నీటిపై ఆధారపడటం తమ టనడకు ఉన్న ఓ ప్రత్యేకత అని తెలిపారు. వర్షపు నీటిని సేకరించి, సాగుకు ఉపయోగిస్తామని చెప్పారు.
కొండ వాలు ప్రాంతాల్లో సాగు చేయడం జపాన్లో 1970వ దశకం వరకు సర్వసాధారణంగా కనిపించేది. అయితే రైతుల్లో వృద్ధుల సంఖ్య పెరగడం, యంత్రాల వినియోగం పెరగడంతో ఈ అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు అదృశ్యమయ్యాయి.
కమోగావా సిటీలో ఒయమ సెన్మైదాకు చెందిన టెర్రాస్డ్ రైస్ ప్యాడీ సాగు నేటికీ కొనసాగుతోంది. ఈ ప్రాంతం పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఒయమ సెన్మైదా ఫీల్డ్లో ఓనర్ సిస్టమ్లో సాగు చేస్తున్నారు. కొంత భూమిని ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. దీనిలో పండిన వరి పంటలో 40 కేజీలు స్థానిక రైతుకు ఇచ్చి, మిగిలినదానిని ఆ భూమిని దత్తత తీసుకున్నవారు తీసుకుంటారు.