ఏబీఎన్ చేతిలో పోలీసులకు దేవరాజ్ ఇచ్చిన ఆడియో టేపులు
ABN , First Publish Date - 2020-09-11T00:59:36+05:30 IST
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజు అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు పూటకో మలుపు తిరుగుతోంది.
హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజు అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో దేవరాజును పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా దేవరాజు పోలీసులకు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులకు దేవరాజ్ ఇచ్చిన ఆడియో టేపులు ఏబీఎన్ చేతికి వచ్చాయి. సాయి, నిర్మాత అశోక్, శ్రావణిని బెదిరించిన ఆడియో టేపులు, శ్రావణితో ఉన్న బ్యాంక్ లావాదేవీల వివరాలు పోలీసులకు దేవరాజు ఇచ్చాడు. శ్రావణి దగ్గర తాను డబ్బు తీసుకోలేదని దేవరాజు చెప్పాడు. శుక్రవారం సాయి, నిర్మాత అశోక్ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. శ్రావణి ఆత్మహత్యకు ఎవరి వేధింపులు కారణమో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
కాగా.. దేవరాజ్ను పోలీసులు ఏడు గంటలుగా విచారిస్తున్నారు. దేవరాజు దాదాపు 10 మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలనే కొనసాగించాడనే అంశంపై కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్ అవుతున్న వార్తలను దేవరాజ్ ఖండించాడు. ఆమె మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేదని ఓ వీడియోను రికార్డు చేసి విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయి కారణమని.. తమను కలవద్దంటూ కుటుంబసభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. మొత్తం మీద ఈ ట్రయాంగిల్ స్టోరీలో నలిగిపోయి... వేధనకు గురై.. చివరకు శ్రావణి మృతి చెందినట్లు తెలుస్తోంది.