వంచకుడి చేతిలో చిక్కి విలవిల్లాడా!

ABN , First Publish Date - 2020-07-15T08:48:32+05:30 IST

ఓ వంచకుడి వలలో చిక్కి.. రెండు నెలలపాటు నరకం అనుభవించానని ఆస్ట్రేలియా మాజీ సర్ఫర్‌ కార్మెన్‌ గ్రీన్‌ట్రీ చెప్పింది. తనను కిడ్నాప్‌ చేసిన ఆ వ్యక్తి..

వంచకుడి చేతిలో చిక్కి విలవిల్లాడా!

పదేపదే అత్యాచారం.. చిత్రహింసలు

భారత్‌లో భయానక అనుభవంపై ఆసీస్‌ సర్ఫర్‌ 

న్యూఢిల్లీ: ఓ వంచకుడి వలలో చిక్కి.. రెండు నెలలపాటు నరకం అనుభవించానని ఆస్ట్రేలియా మాజీ సర్ఫర్‌ కార్మెన్‌ గ్రీన్‌ట్రీ చెప్పింది. తనను కిడ్నాప్‌ చేసిన ఆ వ్యక్తి.. కశ్మీర్‌లో అనేకసార్లు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. వెళ్లిపోతానని అంటే.. దారుణంగా హింసించేవాడని చెప్పింది. కానీ, నేరస్థుడి అత్యాశ వల్లే ఆ నరకం నుంచి విముక్తి లభించినట్టు వివరించింది. భారత్‌లో తాను అనుభవించిన భయానక రోజులను ‘ఎ డేంజర్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పుస్తకంలో అక్షరీకరించింది. అప్పుడు తనకు 22 ఏళ్లని తెలిపింది. ధర్మశాలలో 2004లో దలైలామా ఆశ్రమానికి వెళ్లే ప్రయత్నంలో ఈ ఘోరం జరిగిందని తెలిపింది. అయితే, భద్రతా పరమైన సూచనలను పెడచెవిన పెట్టడంతోనే తనకీ దారుణ పరిస్థితులు ఎదురయ్యాయని పుస్తకంలో రాసింది. 

మాయమాటల్లో పడ్డా..

‘ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి కశ్మీర్‌ నుంచి ధర్మశాల వెళ్లడం సులువని చెప్పడంతో వారి మాయ మాటల్లో పడ్డా. రోడ్డు ప్రయాణం ద్వారా ధర్మశాలకు 14 గంటల్లో చేరుకోవచ్చని పుస్తకంలో ఉన్నా.. ఏమాత్రం ఆలోచించలేదు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు రఫిక్‌ అహ్మద్‌ డుంగూ అనే వ్యక్తి నన్ను రిసీవ్‌ చేసుకున్నాడు. దాల్‌ సరస్సులోని హౌస్‌ బోట్‌లో ఓ రాత్రి ఉంటే.. తర్వాతి రోజు ధర్మశాలకు ప్రయాణ ఏర్పాటు చేస్తాడని అతడు చెప్పాడ’ని గ్రీన్‌ట్రీ రాసింది. అలా నమ్మడమే తనపాలిట శాపమైందని పేర్కొంది. తన పాస్‌పోర్ట్‌, డాక్యుమెంట్‌లను కూడా రఫిక్‌ స్వాధీనం చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి హౌస్‌ బోట్‌లో రెండు నెలలపాటు ప్రతీ రోజూ తనపై రఫిక్‌ అత్యాచారం చేసే వాడని కార్మెట్‌ వాపోయింది. అతడితో పోరాడలేక శరీరాన్ని అప్పగించేశానని తన దీనస్థితిని వివరించింది. ఈ మధ్యలో రఫిక్‌ తన వద్దనున్న డబ్బు మొత్తాన్ని తీసుకోవడంతోపాటు అదనంగా మరింత సొమ్ము గుంజేందుకు తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేయించి దొరికిపోయాడని గ్రీన్‌ట్రీ తెలిపింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, సైన్యం వచ్చి తనను రక్షించారని చెప్పింది. ఇప్పుడు కార్మెల్‌కు 37 ఏళ్లు. ముగ్గురు పిల్లలు, భర్తలో సంతోషంగా గడుపుతోంది. కానీ, ఆ భయానక సంఘటన గుర్తుకు వస్తే ఇప్పటికీ వణికిపోతానని తెలిపింది. 

Updated Date - 2020-07-15T08:48:32+05:30 IST