207 బంతులు ఆడినా ఓటమిని అడ్డుకోలేకపోయిన బట్లర్.. రెండో టెస్టులోనూ ఆసీస్‌దే విజయం

ABN , First Publish Date - 2021-12-20T21:54:55+05:30 IST

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో (డే/నైట్) టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ..

207 బంతులు ఆడినా ఓటమిని అడ్డుకోలేకపోయిన బట్లర్.. రెండో టెస్టులోనూ ఆసీస్‌దే విజయం

అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో (డే/నైట్) టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 82/4తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లంగ్ 192 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు.. ముఖ్యంగా జే రిచర్డ్‌సన్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటింగ్ కకావికలైంది.


జోస్ బట్లర్ 207 బంతులు ఆడి డ్రా కోసం శాయశక్తులా కృషి చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడుకోలేకపోయాడు. అన్ని బంతులు ఎదుర్కొన్న బట్లర్ చేసింది 26 పరుగులు మాత్రమే. రిచర్డ్‌సన్ తొలిసారి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన మార్నస్ లబుషేన్‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.


 కాగా, డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేయాకు ఇది వరుసగా 9వ గెలుపు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 473/9 వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌటై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభమవుతుంది.

Updated Date - 2021-12-20T21:54:55+05:30 IST