వార్న్.. గ్రేటెస్ట్ లెవెన్
ABN , First Publish Date - 2020-04-02T10:05:29+05:30 IST
ఆల్టైమ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? అంటే.. సౌరవ్ గంగూలీనే అంటున్నాడు ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్. గ్రేటెస్ట్ ఇండియా-11 పేరిట తన ...
న్యూఢిల్లీ: ఆల్టైమ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? అంటే.. సౌరవ్ గంగూలీనే అంటున్నాడు ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్. గ్రేటెస్ట్ ఇండియా-11 పేరిట తన జట్టును ప్రకటించిన వార్న్.. వీరిలో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేతో పాటు మహ్మద్ అజరుద్దీన్కు చోటు కల్పించాడు. తన హయాంలో, తనతో ఆడిన భారత ఆటగాళ్లతోనే జట్టును రూపొందించానని.. అందుకే తన జట్టులో విరాట్ కోహ్లీ, ధోనీకి చోటు కల్పించలేదని వార్న్ చెప్పుకొచ్చాడు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, నవ్జ్యోత్సింగ్ సిద్ధూలను తీసుకున్న వార్న్.. తాను ఆడే సమయంలో స్పిన్ను సమర్ధంగా ఎదుర్కొన్నందునే మిగతావాళ్లను కాదని సిద్ధూకు ఓపెనింగ్ స్థానమిచ్చానన్నాడు. అయితే, ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డున్న వీవీఎస్ లక్ష్మణ్కు మాత్రం వార్న్ జట్టులో చోటివ్వలేదు. కెప్టెన్గా సౌరవ్ గంగూలీని తీసుకున్నానని, అందుకే సొగసరి లక్ష్మణ్ను పక్కన పెట్టక తప్పలేదని తన నిర్ణయాన్ని వార్న్ సమర్ధించుకున్నాడు.
వార్న్ జట్టు ఇదే : గంగూలీ (కెప్టెన్), సెహ్వాగ్, నవ్జ్యోత్సింగ్ సిద్ధూ, ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, అజరుద్దీన్, కపిల్ దేవ్, నయన్ మోంగియా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే.