అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు : మంత్రి అవంతి
ABN , First Publish Date - 2020-04-02T09:24:56+05:30 IST
నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న షాపుల లైసెన్సులు రద్దు చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి/కొత్తూరు: నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న షాపుల లైసెన్సులు రద్దు చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం శారదానగర్ శ్రీనివాస కల్యాణ మండపంలో అనకాపల్లి నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలోటాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో డీఎస్పీ, ఆర్డీవో, జోనల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీవో, డాక్టర్లు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించే కూరగాయలు నేరుగా అమ్ముకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పారిశధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో సీతారామారావు, డీసీహెచ్ఎస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఎలమంచిలి: సమష్టి సహకారంతో కరోనావైరస్ వ్యాప్తి నివారించవచ్చునని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎలమంచిలిలో కోవిడ్-19 నియంత్రణపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులకు మొబైల్ బజారు ద్వారా సరుకులు అందించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలన్నారు. రాజీవ్ గాంధీ క్రీడామైదానంలో కూరగాయల మార్కెట్ను మంత్రి సందర్శించారు.