తూతూమంత్రంగా నాడు-నేడు పనులు

ABN , First Publish Date - 2021-08-17T06:31:57+05:30 IST

నాడు-నేడు పనులు తూతూమంత్రంగా జరగడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థుల తరగతులు ప్రారంభమయ్యాయి.

తూతూమంత్రంగా నాడు-నేడు పనులు
పరికరాల జాడలేని సైన్సు ల్యాబ్‌

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 16: నాడు-నేడు పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలతో విద్యనందిస్తామని పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవన్నీ ఉత్తుత్తివేనని తేలుతోంది. ఇందుకు శ్రీకాళహస్తి పట్టణ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పనులే నిదర్శనం. నాడు-నేడు పథకం కింద తొలి విడతలో ఈ పాఠశాలకు రూ.71.90 లక్షల నిధులు మంజూరు చేశారు. మొత్తం 65 రకాల పనులు చేసే లక్ష్యంగా గత ఏడాది మే 28న వీటిని ప్రారంభించారు. మరుగుదొడ్ల నిర్మాణం, వైరింగ్‌, ఫ్లోరింగ్‌ మరమ్మతులు, బోరు, నీటిశుద్ధి యంత్రం, కొత్తబెంచీల ఏర్పాటు, సైకిల్‌షెడ్‌ నిర్మాణం, డిజిటల్‌, వర్చువల్‌ ల్యాబ్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ ల్యాబ్‌ల ఆధునీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది. 


అంతంతమాత్రమే.. 

నాడు-నేడు కింద మొత్తం నిధులు విడుదలైనా.. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో అరకొర పనులే నిర్వహించారు. ఏడాది కాలం పూర్తయినా కొత్త భవనాల నిర్మాణం జరగలేదు. ఇక్కడున్న పాత భవనాలకే రంగులద్దారు. మ్యాథ్స్‌ ల్యాబ్‌ ఆధునీకరణ పనుల జాడలేదు. సైన్స్‌ ల్యాబ్‌లో నూతన పరికరాలు ఏర్పాటు చేయలేదు. ల్యాబ్‌లో విద్యుత్‌ తీగలు వేలాడుతూ కన్పిస్తున్నాయి. కొత్త వాష్‌ బేసిన్‌ను శుభ్రం చేయక పోవడంతో అధ్వానంగా దర్శనమిస్తోంది. నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు చేసినా అందుబాటులోకి రాలేదు. ఇక హెచ్‌ఎం గది ఫ్లోరింగ్‌ పనులు సోమవారం కూడా జరుగుతూనే ఉన్నాయి. వర్చువల్‌ ల్యాబ్‌లో ఫ్లోరింగ్‌ మ్యాట్‌ మాత్రమే ఏర్పాటు చేశారు. డిజిటల్‌ స్ర్కీన్‌, ప్రొజెక్టర్‌, కంప్యూటర్‌ను ఏర్పాటు చేయలేదు. డిజిటల్‌ ల్యాబ్‌లో మరమ్మతులకు గురైన కంప్యూటర్లు, మూలపడిన విద్యుత్‌ వైర్లు కన్పిస్తున్నాయి. ఇక షెడ్డు నిర్మించక పోవడంతో ఆరుబయటే విద్యార్థులు సైకిళ్లు ఉంచాల్సి వస్తోంది. దీంతో సోమవారం జడ్పీ బాలికోన్నత పాఠశాల పునఃప్రారంభం కాగా, అసౌకర్యాల నడుమ విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-08-17T06:31:57+05:30 IST