ఆ భూమికి ఎందుకంత డిమాండ్..!

ABN , First Publish Date - 2021-06-16T06:49:15+05:30 IST

అయోధ్యలో రాజుకున్న భూవివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న భూమి కొనుగోళ్లలో మోసాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చింది.

ఆ భూమికి ఎందుకంత డిమాండ్..!

రోడ్డు పక్కనే 12,080 చ.మీటర్ల స్థలం

రామాలయానికి అదే ప్రధాన మార్గం

18.5 కోట్ల కన్సిడరేషన్‌ మొత్తానికి మేము కొన్నాం

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రకటన


న్యూఢిల్లీ/ఇండోర్‌ జూన్‌ 15: అయోధ్యలో రాజుకున్న భూవివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న భూమి కొనుగోళ్లలో మోసాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చింది. ‘‘రామాలయ నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలోని బాగ్‌ జైసీ గ్రామంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో కొన్న 12,080 చదరపు మీటర్ల భూమి రోడ్డుకి పక్కనే ఉంటుంది. అంతేగాక, ఇక్కడ త్వరలోనే నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరగనుంది. రామ జన్మభూమి మందిరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం కానుంది. కాబట్టి ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. మేము చదరపు అడుగుకు రూ.1,423 చొప్పున ఇచ్చి ఆ భూమిని కొన్నాము. మార్కెట్‌ ధర కన్నా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేశాం. ఈ భూమికి సంబంధించి 2011 నుంచి చాలా మంది వ్యక్తుల మధ్య ఈ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయి. అయితే, ఆ భూమి యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టతలేదు. ముందుగా ఆ భూమి యాజమాన్య హక్కులు పూర్తిగా ఎవరికి చెందుతాయో ఖరారు చేయాల్సి ఉందని న్యాస్‌ భావించింది.


పదేళ్లుగా జరిగిన ఒప్పందాలన్నింటిలో మొత్తం తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. వారిలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు. మొత్తం తొమ్మిది మందితోనూ చర్చలు జరిపాం. ఆ తర్వాత వారంతా గత ఒప్పందాలన్నింటిపై చర్చించి భూ యాజమాన్య హక్కుల అంశంపై పరిష్కారం చూపుతూ తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో మార్చి 18న ఆ భూమిని కుసుమ్‌ పాఠక్‌, హరీశ్‌ పాఠక్‌ నుంచి రవి మోహన్‌ తీవారీ, సుల్తాన్‌ అన్సారీ కొన్నారు. ఇందుకు వారు రూ.2 కోట్ల కన్సిడరేషన్‌ మొత్తం పాటు సర్కిల్‌ రేట్‌ వాల్యుయేషన్‌కు రూ.5.80 కోట్లు, స్టాంపులకు రూ.5.80 కోట్లు ఖర్చు చేశారు. ఆ వెంటనే ఆ భూమిని రవి మోహన్‌ తివారీ, సుల్తాన్‌ అన్సారీ నుంచి కొనడానికి రూ.18.5 కోట్ల కన్సిడరేషన్‌ మొత్తానికి రామ జన్మభూమి ట్రస్టు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్సుగా రూ.17 కోట్లు ఇచ్చాం. వారితో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ట్రస్టు శరవేగంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, పూర్తి పారదర్శకంగానే వ్యవహరించింది. ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే లావాదేవీలు జరిగాయి. మరోవైపు, ఇప్పటికే మేము రామాలయ నిర్మాణానికి 3-4 ప్లాట్లను కొన్నాము. భవిష్యత్తులోనూ కొంటాము’ అని ట్రస్ట్‌ స్పష్టం చేసింది. కాగా, బీజేపీ మద్దతుదారులు ఢిల్లీలోని తన ఇంటిపై దాడి చేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ చెప్పారు.


రామాలయ నిర్మాణం కోసం కొనుగోలు చేస్తోన్న భూముల విషయంలో అవినీతి జరిగిందని ఇటీవల సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అయోధ్యలో 12,080 చదరపు మీటర్ల భూమిని ఒక వ్యక్తి రూ.2 కోట్లకు కొంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ దాన్ని రూ.18.5 కోట్లకు కొన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సింగ్‌ ఇంటిపై దాడి జరిగిందని ఆప్‌ నేతలు అంటున్నారు.



Updated Date - 2021-06-16T06:49:15+05:30 IST