వీఎంఆర్డీఏ నిధులు రూ.24 కోట్లు మింగేశారు
ABN , First Publish Date - 2020-10-25T10:32:56+05:30 IST
శాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ)లో రూ.24 కోట్ల నిధులు అంతా కలిసి మింగేశారని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
అధికారులపై అయ్యన్న ఆరోపణలు
విశాఖపట్నం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ)లో రూ.24 కోట్ల నిధులు అంతా కలిసి మింగేశారని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదలకు ఇళ్లు పేరుతో 1,200 ఎకరాలను వీఎంఆర్డీఏ నిధులతో చదును చేయించారని, కానీ ఎక్కడా పనులు సవ్యంగా జరగలేదన్నారు. కనీసం మట్టి కూడా సరిగ్గా వేయలేదన్నారు. శ్మశానాలు, చెరువులు, గోతుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. వీఎంఆర్డీఏ నిధులు అంటే... ప్రజల డబ్బు అని, తాను దీనిపై గతంలో ఆరోపణలు చేస్తే.. వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు గాని, మంత్రి బొత్స సత్యనారాయణ గాని, వైసీపీ నాయకులు గానీ దీనిని ఖండించడం లేదన్నారు. అంటే.. అంతా కలిసి గూడుపుఠాణీ చేసి రూ.24 కోట్లు తినేశారని అర్థమవుతోందన్నారు. ఇలా ఎన్ని రకాలుగా విశాఖపట్నాన్ని దోచేయవచ్చో అన్ని రకాలుగా చేస్తున్నారని, దీనికి ఐఏఎస్ అధికారులే సహకరిస్తున్నారని విమర్శించారు.