నాకు రెండు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి, అందుకే కొట్టారు: ‘Ayyayyo vaddamma’ శరత్
ABN , First Publish Date - 2021-10-19T16:43:23+05:30 IST
‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ అంటూ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన డాన్సర్ శరత్ అందరికీ తెలుసు.
హైదరాబాద్: ‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ అంటూ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన డాన్సర్ శరత్ అందరికీ తెలుసు. ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ చూసినా అతని డాన్సు.. అతని మాటలే వినిపించాయి. ఎంత ఫేమస్ అయిపోయాడు అంటే ఒకప్పుడు నా వీడియోస్ను వైరల్ చేయండి అని వేడుకున్న శరత్.. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్ అయిపోయాడు. అంత ఫేమస్ అయ్యింది మాత్రం అయ్యయ్యో వద్దమ్మా అనే యాడ్తోనే. కానీ, ఇప్పుడు ఆ యాడే అతనికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. శరత్పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు.
డ్యాన్సర్ శరత్ను ముక్కు నుంచి రక్తం వచ్చేలా కొట్టారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. హిజ్రాలపై కామెంట్స్ చేయడంతో వాళ్లే శరత్ను కొట్టారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తనపై దాడి చేసింది హిజ్రాలు కాదని తాజాగా ఏబీఎన్తో మాట్లాడుతూ శరత్ తెలిపాడు. ‘‘నా వ్యతిరేక వర్గం నాపై దాడి చేసింది. గతంలో నా చెల్లిని వేధింపులకు గురిచేస్తుంటే సాయి, హరి వర్గంపై దాడి చేశాను. ఆ కేసులో నేను గతంలో జైల్కు వెళ్లి, బెయిల్పై బయటికి వచ్చాను. నేను బెయిల్పై జైలు నుంచి బయటకు రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక, నా ఎదుగుదలను ఓర్చుకోలేక నాపై విచక్షణ రహితంగా దాడి చేశారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శరత్పై జరిగిన దాడిని కొందరు ఎంజాయ్ చేస్తూ మీమ్స్ కూడా చేశారు. సడెన్గా అతడు ఫేమస్ అవ్వడం కొందరికి నచ్చకే అలా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన సాయి, హరి వర్గంపై రామగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని శరత్ చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.