రైల్వేస్టేషన్లో తప్పిపోయిన బాలిక క్షేమం
ABN , First Publish Date - 2021-06-23T06:05:56+05:30 IST
హైదరాబాద్లో ఉన్న అమ్మ,నాన్న వద్దకు వెళ్లేందుకు తాతయ్యతో బయలుదేరిన మనుమరాలు ఇష్టం లేకపోవడంతో అదృశ్యమై చివరికి పోలీసులకు చిక్కింది.
కుటుంబ సభ్యులకు అప్పగించిన రూరల్ పోలీసులు
మండపేట, జూన్ 22: హైదరాబాద్లో ఉన్న అమ్మ,నాన్న వద్దకు వెళ్లేందుకు తాతయ్యతో బయలుదేరిన మనుమరాలు ఇష్టం లేకపోవడంతో అదృశ్యమై చివరికి పోలీసులకు చిక్కింది. మండపేట రూరల్ పోలీసుల కథనం ప్రకారం మండపేట పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు మనమరాలితో సోమవారం రాత్రి మండపేట నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లేందుకు ద్వారపూడి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైలు వచ్చే ముందు స్టేషన్లో మంచినీరు తాగేందుకు తాతయ్య వెళ్లి తిరిగివచ్చేసరికి మనుమరాలు కనిపించలేదు. దీంతో అతడు సోమవారం రాత్రి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన మండపేట రూరల్ ఎస్ఐ శివకృష్ణ సిబ్బందితో రైల్వేస్టేషన్లో గాలించగా అర్ధరాత్రి 12గంటల సమయంలో రైల్వేస్టేషన్లోనే బాలిక దొరకడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. బాలిక కిడ్నాప్కు గురైందన్న విషయం సోషల్మీడియాలో హల్చల్ చేసింది.