బడిలో రైతు భరోసా కేంద్రం!
ABN , First Publish Date - 2021-10-27T06:40:56+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయరాదని, అటువంటి వాటిని వెంటనే తొలగించాలని న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ కొందరు అధికార పార్టీ నాయకులకు చెవికెక్కడం లేదు. ఉమ్మలాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం నేటికీ ఖాళీ చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ.
న్యాయస్థానం ఆదేశాలు పట్టించుకోని అధికార పార్టీ నాయకులు
ఉమ్మలాడ ప్రాథమిక పాఠశాలలో ఇంకా కొనసాగింపు
ఎంఈవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు
మునగపాక, అక్టోబరు 26 : ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయరాదని, అటువంటి వాటిని వెంటనే తొలగించాలని న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ కొందరు అధికార పార్టీ నాయకులకు చెవికెక్కడం లేదు. ఉమ్మలాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం నేటికీ ఖాళీ చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. దీంతో పాఠశాలలో ఉన్న ఐదు తరగతులకు మూడు గదులు మాత్రమే ఉండడంతో ఒక్కొక్క గదిలో రెండు తరగతులను బోధించాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రాన్ని పాఠశాల నుంచి తొలగించామని గ్రామ కార్యదర్శి వెంకట్, వ్యవసాయ సహాయకులు రవిరాజ్ చెబుతున్నా.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాతునాయుడు మాత్రం రైతు భరోసా కేంద్రానికి చెందిన సామగ్రి కొంత ఉందని చెపుతున్నారు. సర్పంచ్ కుటుంబీకులు క్యాంప్ కార్యాలయంగా ఈ భవనాన్ని వాడుకుంటామని చెప్పడంతో వారి మాట కాదనలేక వారికి అప్పగించామని వివరించారు. సర్పంచ్ కుటుంబీకులు ఈ భవనంలోనే విందు, విలాసాలు చేసుకోవడంతో పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విషయమై విద్యార్థి తండ్రి కంకణాల గణేశ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈవో దేవరాయులను వివరణ కోరగా, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను తొలగించడం జరిగిందని చెప్పారు. అయితే ఉమ్మలాడలో మాత్రం సామగ్రి ఉండిపోవడంతో ఆ భవనాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదన్నారు. దీనిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.