బ్రోచేవారెవరురా?

ABN , First Publish Date - 2022-04-04T08:56:42+05:30 IST

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్న ..

బ్రోచేవారెవరురా?

  • భద్రాద్రి ఆలయానికి మోక్షమెప్పుడు?
  • నోటి మాటల్లోనే దక్షిణ అయోధ్య అభివృద్ధి 
  • రెండుసార్లు రాష్ట్ర బడ్జెట్‌లో 
  • రూ.150 కోట్ల కేటాయింపులు 
  • ఒక్క రూపాయీ ఖర్చు చేయని ప్రభుత్వం
  • యాదాద్రిలాగా అభివృద్ధి చేస్తామన్న సీఎం 
  • ఇప్పటికీ అమలుకాని ముఖ్యమంత్రి హామీ
  • ఇకనైనా దృష్టిపెట్టాలంటున్న భక్తులు

భద్రాచలం, ఏప్రిల్‌ 3: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ... ప్రకటనల వరకే పరిమితమైంది.  రెండుసార్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దీంతో భద్రాద్రి అభివృద్ధి నోటిమాటగానే మిగిలిపోయింది.  యాదాద్రి తరహాలో భద్రాద్రినికూడా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. దీంతో  భద్రాద్రి అభివృద్ధి జరుగుతుందని  భక్తులు ఆశించారు. కానీ ప్రభుత్వం  ఎప్పటికప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తూ నిధులను మాత్రం విడుదల కాకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ప్రధానఆలయ పునర్‌నిర్మాణ పనులకు రూ.1280 కోట్లు కేటాయించి పూర్తి చేసింది. దాని తరువాత ప్రభుత్వ హామీ ప్రకారం భద్రాద్రి అభివృద్ధికి మోక్షం లభిస్తుందని అంతా భావించారు. కానీ తాజాగా.. వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి అభివృద్ధినీ మరువకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవాదులు అభిప్రాయపడుతున్నారు.  


రెండు విడతల్లో రూ.150కోట్ల కేటాయింపులు

భద్రాద్రి ఆలయాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. 2015, 2016 శ్రీరామనవమి సమయంలో రెండుసార్లు ఆయన భద్రాద్రికి వచ్చారు. ఈ సమయంలో రూ.100కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని, అవసరమైతే తాను చినజీయర్‌స్వామితో వచ్చి భద్రాద్రి ఆలయాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. 2017రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో భద్రాద్రి అభివృద్ధి కోసం రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి బడ్జెట్‌లో ఆమోదం తెలిపింది.   ఆలయ అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడంలో  అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు. తుది మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమైందని కేసీఆర్‌ ఆమోదంతో భద్రాద్రి ఆలయాభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు.కానీ అడుగు ముందుకు పడలేదు. 2019వార్షిక బడ్జెట్‌లో మరోసారి భద్రాద్రి అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయించారు. ఆ నిధులనూ విడుదల చేయకపోవడంతో భక్తులు ఉసూరుమన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా భద్రాద్రి ఆలయాభివృద్ధికి కనీసం రూపాయి కూడా వెచ్చించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


భద్రాద్రిపై ఎందుకింత వివక్ష ?

యాదాద్రి అభివృద్ధి తరువాత భద్రాద్రి అభివృద్ధి చేస్తామని ప్రకటనలు చేసి ఇంతకాలం ప్రభుత్వం సాగదీసింది. భద్రాద్రిపై దృష్టిసారించకపోవడం ఎంతవరకు సబబు.. భద్రాద్రిపై ఎందుకింత వివక్షతో వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదు. భద్రాద్రి ఆలయాభివృద్ధితో మళ్లీ భద్రాద్రి అభివృద్ధి బాటపట్టాలని అందరూ భావిస్తున్నారు.

-పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే

Updated Date - 2022-04-04T08:56:42+05:30 IST