ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల జీతాల కోసం.. భారీ ప్యాకేజీ ప్రకటించిన బహ్రెయిన్
ABN , First Publish Date - 2020-04-09T17:08:39+05:30 IST
కరోనా కల్లోలంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా బాగా చితికిపోతున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
బహ్రెయిన్: కరోనా కల్లోలంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా బాగా చితికిపోతున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. గల్ఫ్లో కూడా కొవిడ్-19 వీర విహారం చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు చిగురాటకుల వణికిపోతున్నాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడంతో ఆదాయం లేకుండా పోయింది. ఈ ప్రభావం ప్రభుత్వ రంగ ఉద్యోగులపై అంతగా పడకపోయిన ప్రైవేటు రంగాలకు చెందిన కార్మికులపై మాత్రం గట్టిగానే పడబోతోంది.
ఇది గ్రహించిన బహ్రెయిన్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు లక్ష మంది ప్రైవేటురంగ కార్మికుల జీతాల కోసం 570 మిలియన్ డాలర్ల(రూ. 43,57,96,35,000) ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేగాక దేశ ప్రజలు, వ్యాపారాల కోసం ఎలక్ట్రిక్, నీటి బిల్లులు, పర్యాటక రంగం, ఆస్తులపై కూడా కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు బహ్రెయిన్ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక గల్ఫ్లోని ఆరు దేశాల్లో బుధవారం నాటికి 9,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది మరణించారు. ప్రధానంగా ఈ మహమ్మారి ప్రభావం సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో తీవ్రంగా ఉంది. యూఏఈలో బుధవారం ఒక్కరోజే 300 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,659కి చేరింది.