బేకరీలో పని చేసే భారత వ్యక్తికి రూ. 24 కోట్ల లాటరీ..!
ABN , First Publish Date - 2020-06-04T16:10:28+05:30 IST
బేకరీలో పని చేసే భారత వ్యక్తికి అబుధాబిలో జాక్పాట్ తగిలింది.
అబుధాబి: బేకరీలో పని చేసే భారత వ్యక్తికి అబుధాబిలో జాక్పాట్ తగిలింది. బుధవారం నిర్వహించిన అబుధాబి బిగ్ టికెట్ లాటరీ డ్రాలో 12 మిలియన్ దిర్హామ్స్(రూ. 24.60 కోట్లు) గెలుచుకున్నాడు. అజ్మాన్లోని ఓ బేకరీలో పనిచేసే కేరళ రాష్ట్రం కోజికోడ్కు చెందిన అస్సేన్ ముజిప్పురత్(47) ఇలా రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు. ఈ సందర్భంగా అస్సేన్ మాట్లాడుతూ... "గత 28 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాను. ఇటీవలె కోవిడ్-19 సంక్షోభం వల్ల స్వదేశానికి తిరిగి వచ్చాను. ఇన్నేళ్లుగా పరాయి దేశంలో ఉన్న సంపాదించింది ఏమీ లేదు. దీంతో నాలుగైదు సార్లు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి నా అదృష్టాన్ని పరీక్షించికున్నాను. ఈ సారి కూడా అలాగే లాటరీ టికెట్ కొన్నాను. దాంతో నాకు అదృష్టం కలిసొచ్చింది. ఇప్పటికీ తాను ఇంతా భారీ మొత్తం గెలుచుకున్నానంటే నమ్మలేకపోతున్నాను. మొదట లాటరీ నిర్వహకుల నుంచి ఫోన్కాల్ వచ్చినప్పుడు నమ్మలేదు. ఎవరో కావాలని ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నారనుకున్నా. ఆ తర్వాత వారు పూర్తి వివరాలు చెప్పడంతో ఆశ్చర్యపోవడం నా వంతైంది." అని అన్నారు.
"మే 14న కొన్న నెం. 139411 గల లాటరీ టికెట్ నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. నా జీవితంలో కొత్త మలుపుకు కారణమైన బిగ్ టికెట్ లాటరీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. నేను గెలుచుకున్న ఈ భారీ నగదులో కొంత మొత్తం పేదవారి కోసం వినియోగిస్తానని" ముజిప్పురత్ తెలిపారు. అతనికి భార్య షరీఫా, ఇద్దరు కుమార్తెలు సనా ఫాతిమా, అలా ఫాతిమా ఉన్నారు.