ముగ్గుర్ని బలితీసుకున్న వేగం

ABN , First Publish Date - 2021-10-20T05:22:36+05:30 IST

అతివేగం ముగ్గురిని బలిగొంది. ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని అధిగమించే (ఓవర్‌టెక్‌) క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది.

ముగ్గుర్ని బలితీసుకున్న వేగం
కారులో మృతదేహాలను వెలికి తీయిస్తున్న డీఎస్పీ, పోలీసులు

కావలి వద్ద కంటైనర్‌ను ఢీకొన్న కారు

ముగ్గురు దుర్మరణం, ఒకరికి స్వల్ప గాయాలు

మృత్యుంజయుడిగా బాలుడు

మృతుల్లో అత్తా కోడళ్లు.. ఇద్దరూ తిరుపతి వాసులే


కావలి రూరల్‌, అక్టోబరు 19: అతివేగం ముగ్గురిని బలిగొంది. ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని అధిగమించే (ఓవర్‌టెక్‌) క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. మృతుల్లో ఇద్దరు తిరుపతి వాసులు కాగా ఒకరు జిల్లాలోని కోవూరు వాసి. కావలి పట్టణం ముసునూరు సమీపంలో కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని పద్మావతినగర్‌కు చెందిన పల్లమాల రవి, అతని భార్య భార్గవీలత, తల్లి రాజేశ్వరమ్మలు ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మంగళవారం మధ్యాహ్నం కారులో  తిరుగు పయణమయ్యారు. అదే కారులో వారి బంధువైన కోవూరుకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి ఇరుగు రమణయ్య, అతని మనుమడు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలోని ముసునూరు సమీపంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ లారీని అధిగమించే క్రమంలో లారీని వెనుక వైపు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా కారు డ్రైవింగ్‌ చేస్తున్న పల్లమాల రవి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అతని భార్య భార్గవీలత (40), తల్లి రాజేశ్వరమ్మ(70), కావలి ఆర్టీసీ డిపోలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కోవూరుకు చెందిన ఇరుగు రమణయ్య(65) కారులోనే ఇరుక్కుని ప్రాణాలు విడిచారు. మృతురాలు భార్గవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కాగా రమణయ్య కుటుంబ సభ్యులు బస్‌లో వెళ్లగా తాతతో కలసి కారులో ఎక్కిన కుమార్తె రజనీ కుమారుడు వాకాడుకు చెందిన బాలుడు సువినాష్‌ సాయి (8) ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్‌ గాయపడిన రవిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా క్రేనతో కారును పక్కకు తొలగించారు. కావలి రూరల్‌ సీఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T05:22:36+05:30 IST