భారత ప్రయాణికులపై నిషేధం
ABN , First Publish Date - 2021-04-09T06:25:27+05:30 IST
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది
ఈ నెల 11 నుంచి 28 వరకు న్యూజిలాండ్ ఆంక్షలు
మెల్బోర్న్/వెల్లింగ్టన్/కంబోడియా, ఏప్రిల్ 8 : భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ పౌరులపైనా ఈ నిషేధం ఉంది. ఏప్రిల్ 11 నుంచి 28 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ వెల్లడించారు. గురువారం అక్కడ నమోదైన 23 కేసుల్లో 17 ఇండియా నుంచి వచ్చినవే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘భారత్ నుంచి వచ్చే వారి వల్ల రిస్క్ పెరుగుతోంది. మరికొన్ని దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధమున్నా, విదేశాల నుంచి వచ్చే న్యూజిలాండ్ పౌరులపై ఆంక్షలు విధించలేదు. మేము కరోనా ఎక్కువగా ఉన్న ఇతర దేశాలనూ గమనిస్తున్నాం. అయితే అక్కడి నుంచి న్యూజిలాండ్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువ’’ అని జెసిండా పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంబోడియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంకోర్ వాట్ ఆలయాల సముదాయాన్ని మూసివేశారు.