బెంగళూరు హింసాకాండ నిందితుల్లో 16 మంది ఎస్‌డీపీఐ సభ్యులు : పోలీసులు

ABN , First Publish Date - 2020-08-14T03:13:48+05:30 IST

మంగళవారం రాత్రి తూర్పు బెంగళూరులో జరిగిన హింసాకాండపై పోలీసులు

బెంగళూరు హింసాకాండ నిందితుల్లో 16 మంది ఎస్‌డీపీఐ సభ్యులు : పోలీసులు

బెంగళూరు : మంగళవారం రాత్రి తూర్పు బెంగళూరులో జరిగిన హింసాకాండపై పోలీసులు 7 ప్రథమ సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్‌లు) నమోదు చేశారు. రెండు పోలీస్ స్టేషన్లలో గురువారం నమోదైన ఈ ఎఫ్ఐఆర్‌లలో పేర్కొన్న నిందితుల్లో 16 మంది సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) సభ్యులు. 


కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఒకరు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కొందరు దుండగులు మంగళవారం రాత్రి ఆ ఎమ్మెల్యే ఇంటిపైనా, పోలీస్ స్టేషన్‌పైనా దాడి చేసిన సంగతి తెలిసిందే. 


దుండగుల దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చింది. ఈ కాల్పుల్లో ముగ్గురు దుండగులు ప్రాణాలు కోల్పోయారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవరజీవనహళ్ళి, కడుగొడనహళ్లి పోలీస్ స్టేషన్లలో సుమారు 300 మంది నిందితులపై 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీరిలో 16 మంది ఎస్‌డీపీఐ సభ్యులుగా గుర్తించారు. ఎస్‌డీపీఐ అనేది పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అనుబంధ సంస్థ. 


ఎమ్మెల్యే శ్రీనివాస్ బంధువు నవీన్‌పై కూడా ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. నవీన్ ఓ అవమానకరమైన  పోస్టును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ పెట్టినట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-14T03:13:48+05:30 IST