బంజారాహిల్స్‌లో రెచ్చిపోయిన 20 మంది యువకులు

ABN , First Publish Date - 2021-05-03T13:30:50+05:30 IST

చిన్న విషయానికి ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.

బంజారాహిల్స్‌లో రెచ్చిపోయిన 20 మంది యువకులు
File photo

  • ఘర్షణకు దిగిన 20 మంది యువకులు
  • బంజారాహిల్స్‌లో రెండు రోజుల్లో రెండు సంఘటనలు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : చిన్న విషయానికి ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 5 దేవరకొండ బస్తీలో బహిరంగ మూత్ర విసర్జన విషయంలో ఇరవై మంది గొడవ పడిన సంఘటన జరిగిన మరుసటి రోజే రోడ్డు నెంబరు 14 నందినగర్‌లో మరొకటి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే సందీప్‌, మనోజ్‌ సినీ పరిశ్రమలో డిజైనర్‌లుగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఇద్దరు తమ గదికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నారు. స్థానికంగా ఉండే శ్రీను అనే యువకుడి పెంపుడు శునకం వారిని కరిచేందుకు ప్రయత్నించింది. సందీప్‌ దాని నుంచి తప్పించుకునేందుకు రాయి విసిరాడు. ఇది గమనించి శ్రీను వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. 


గలాటా విని స్థానికంగా ఉన్న పది నుంచి పదిహేను మంది అక్కడకు వచ్చారు. భయపడ్డ సందీప్‌, మనోజ్‌లు విషయాన్ని స్నేహితులకు తెలిపారు. టీవీ పరిశ్రమలో ఆర్ట్‌ డైరెక్టగా పనిచేస్తున్న బొబ్బిలి సుదర్శన్‌, కొరియోగ్రాఫర్‌ కందుకూరి అనిల్‌, ఆదిత్యతో మరో ఇద్దరు అక్కడకు వచ్చి శ్రీను మిగతా వారితో మాట్లాడుతుండగా అందరూ కలిసి దాడి చేశారు. బొబ్బిలి సుదర్శనతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేష్‌, నర్సింగ్‌ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు.

Updated Date - 2021-05-03T13:30:50+05:30 IST