బ్యాంకుల ఎన్పీఏలు రూ.10 లక్షల కోట్లపైనే..
ABN , First Publish Date - 2021-09-15T08:52:49+05:30 IST
బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్పీఏ) భయం పట్టుకుంది. 2022 మార్చి నాటికి ఈ భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్-క్రిసిల్ సంస్థల అధ్యయనంలో తేలింది.
- అసోచామ్-క్రిసిల్ వెల్లడి
న్యూఢిల్లీ: బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్పీఏ) భయం పట్టుకుంది. 2022 మార్చి నాటికి ఈ భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్-క్రిసిల్ సంస్థల అధ్యయనంలో తేలింది. ఇది బ్యాంకుల మొత్తం రుణాల్లో 8.5 నుంచి 9 శాతానికి సమానం. గతంలో పెద్ద కంపెనీల రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారేవి. కొవిడ్ దెబ్బతో ఇప్పుడు రిటైల్, ఎంఎ్సఎంఈల రుణ ఖాతాల నుంచే ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో పునర్ వ్యవస్థీకరించిన కొన్ని రుణ ఖాతాలు కూడా ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉందని అసోచామ్-క్రిసిల్ అంచనా వేస్తున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే ఎన్పీఏల భారం తక్కువగానే ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. దివాలా చట్టం (ఐబీసీ) కారణంగా గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏల వసూళ్లు బాగానే ఉంటాయని అధ్యయనం అంచనా వేసింది.