బ్యాంకుల బాదుడు

ABN , First Publish Date - 2021-04-12T05:51:20+05:30 IST

దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం.. బ్యాంకుల వైఖరితో నీరుగారుతోంది. సామాన్య ప్రజానీకం సహా చిన్నా చితకా ఖాతాదారులందరినీ బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో...

బ్యాంకుల బాదుడు

  • సర్వీసు చార్జీల పేరుతో వడ్డింపు 
  • జీరో బ్యాలెన్స్‌ ఖాతాలనూ వదలని వైనం
  • ఐదేళ్లలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ
  • మిగతా బ్యాంకులదీ అదే బాట 
  • ఐఐటీ బాంబే నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం.. బ్యాంకుల వైఖరితో  నీరుగారుతోంది. సామాన్య ప్రజానీకం సహా చిన్నా చితకా ఖాతాదారులందరినీ బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో అడ్డగోలుగా బాదేస్తున్నాయి. ఈ విషయంలో దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అందరికంటే ముందుండడం విశేషం. మరోవైపు సర్వీసు చార్జీల విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనలను సైతం అడ్డగోలుగా తుంగలో తొక్కుతున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ.. జీరో బ్యాలెన్స్‌ లేదా బేసిక్‌ సేవింగ్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాల (బీఎ్‌సబీడీఏ)కు సంబంధించి ఖాతాదారులు చేపట్టిన డెబిట్‌ లావాదేవీలు నెలలో నాలుగు మించితే ప్రతి లావాదేవీపైనా రూ.17.70 చొప్పున సర్వీసు చార్జీ వసూలు చేస్తోంది. గడిచిన ఐదేళ్ల (2015-2020)లో ఎస్‌బీఐ తన 12 కోట్ల మంది బీఎ్‌సబీడీఏ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని సర్వీసు చార్జీల రూపంలో వసూలు చేయటం గమనార్హమని ఐఐటీ బాంబే చేపట్టిన సర్వే వెల్లడించింది. ఇందులో రూ.172 కోట్లు ఒక్క 2019-20 కాలంలోనే వసూలు చేయటం విశేషం. కాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కూడా గత ఐదేళ్లలో సర్వీస్‌ చార్జీల పేరుతో రూ.9.9 కోట్ల వరకు వసూలు చేసింది. మిగిలిన బ్యాంకులు కూడా ఇదే బాటలోనే సాగాయని సర్వే తెలిపింది. 



ఆర్‌బీఐ ఉదాసీనత

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చూసినా ఖాతాదారులు బీఎ్‌సబీడీఏ ఖాతాల నుంచి నెలకు నాలుగుసార్లు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్‌ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబరులో ఆర్‌బీఐ దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీన్ని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎ్‌సబీడీఏ, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు వడ్డిస్తున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చూసినా బీఎ్‌సబీడీఏ ఖాతాదారులు నెలకు నాలుగు సార్లకు మించి నగదు విత్‌డ్రా చేసుకున్నా, దాన్ని వాల్యూ యాడెడ్‌ సేవగానే పరిగణించాలి. అయితే బ్యాంకులు ఈ నిబంధనల్ని తుంగలో తొక్కి వీరిపైనా ప్రత్యేక సేవల పేరుతో నడ్డి విరుస్తున్నాయి. 



డిజిటల్‌ చెల్లింపులకు దెబ్బ

ఆర్థిక వ్యవసలో నగదు లావాదేవీలు తగ్గించి డిజిటల్‌ చెల్లింపులు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొవిడ్‌ తర్వాత సామాన్యులు కూడా డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడ్డారు. అయితే బీఎ్‌సబీడీఏ ఖాతాలపై బ్యాంకులు విధిస్తున్న ప్రత్యేక వడ్డింపు చార్జీలు ఇందుకు పెద్ద అడ్డంకిగా మారాయని ఐఐటీ బాంబే సర్వే పేర్కొంది. 

Updated Date - 2021-04-12T05:51:20+05:30 IST