ప్రజల చెంతకే బస్తీ దవాఖాన
ABN , First Publish Date - 2020-08-15T09:25:13+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకొచ్చేందుకు బస్తీ దావఖానాలను ఏర్పాటు చేస్తున్నారని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్
లంగర్హౌజ్: సీఎం కేసీఆర్ ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకొచ్చేందుకు బస్తీ దావఖానాలను ఏర్పాటు చేస్తున్నారని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంబాగ్లో బస్తీ దవాఖానాల ఇన్చార్జి డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన దవాఖానాను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ వారికి బీపీ పరీక్షలతో పాటు టెంపరేచర్ను చెక్చేశారు. ప్రారంభోత్సవానికి ముందు స్థానికులు కమ్యూనిటీ హాల్ను బస్తీ దవాఖానాగా మార్చితే బస్తీలో కార్యక్రమాలను ఎక్కడ చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇబ్రహీంబాగ్లో ఉన్న రెండు కమ్యూనిటీహాల్పై మొదటి అంతస్తులు నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
కార్యక్రమంలో గోల్కొండ శాంతి సంఘం అధ్యక్షుడు సిరిమల్లె రాజువస్తాద్, నానాల్నగర్ కార్పొరేటర్ మహ్మద్ నషీరొద్దీన్, టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి జీవన్సింగ్, కాంగ్రెస్ నాయకుడు పరమానందం, టీఆర్ఎస్ లంగర్హౌజ్ డివిజన్ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, చంద్రకాంత్, కార్తీక్, రాజు, షేక్మసూద్, బస్తీ దావఖానా మెడికల్ ఆఫీసర్ మానస, స్టాఫ్నర్సు జ్యోతి పాల్గొన్నారు.