పదవుల పండుగ

ABN , First Publish Date - 2020-08-11T10:23:57+05:30 IST

త్వరలో ప్రకటించను న్న బీసీ కార్పొరేషన్లలో జిల్లాకు 35 డైరెక్టర్‌ పోస్టులు దక్కనున్నాయి.

పదవుల పండుగ

జిల్లాకు బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్‌ పోస్టులు 35

ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం

నియోజకవర్గానికి 3 చొప్పున కేటాయింపు

ఎమ్మెల్యేల నుంచి పేర్లు సేకరించిన సజ్జల


నెల్లూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రకటించను న్న బీసీ కార్పొరేషన్లలో జిల్లాకు 35 డైరెక్టర్‌ పోస్టులు దక్కనున్నాయి. అమరావతిలో సోమవారం జిల్లా వైసీపీ ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి, సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిల సమక్షంలో జరిగిన జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 54 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా సమీక్షిస్తున్నారు. డైరెక్టర్ల ఎంపిక విషయంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డితో  జిల్లా వైసీపీ నేతల సమావేశం జరిగింది. మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,వరప్రసాద్‌, ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి తరపున విజయడెయిరీ చైర్మన్‌ రంగారెడ్డిలు హాజరయ్యారు.


ఈ సమావేశంలో జిల్లాకు 35 డైరెక్టర్‌ పోస్టులు ఇవ్వాలన్నది రాష్ట్ర పార్టీ నిర్ణయంగా సజ్జల తెలిపారు. డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించి ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లు సిఫార్సు చేయాలని కోరగా ఆ మేరకు ఎమ్మెల్యేలు జాబితా సమర్పించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సమావేశానికి హాజరుకాలేని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు సైతం కాకాణి గోవర్థన్‌రెడ్డి ద్వారా పేర్ల జాబితాను సమర్పించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల నుంచి అందిన జాబితాను పార్టీ అధిష్ఠానం ముందు ఉంచి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు రెండు, మూడు కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులు కూడా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-08-11T10:23:57+05:30 IST