విదేశంలో ఐపీఎల్-2020..: బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటన?
ABN , First Publish Date - 2020-06-04T19:04:38+05:30 IST
ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా రద్దైన
ముంబై: ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ వ్యూహాలు రచిస్తోంది. అవసరమైతే.. విదేశంలో అయినా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘బోర్డు ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ చివరిగా విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే.. అదీ చేస్తాం. విదేశాల్లో లీగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. కానీ, భారత్లో లీగ్ నిర్వహించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము’’ అని అధికారి పేర్కొన్నారు. 2009, 2014 రెండు ఐపీఎల్ సీజన్లు విదేశాల్లోనే జరిగాయి. 2009 సీజన్ దక్షిణాఫ్రికాలో జరగగా.. 2014 సీజన్లో తొలి 20 మ్యాచ్లు యూఏఈలో జరిగాయి.
అయితే టీ-20 ప్రపంచకప్ గురించి స్పష్టత వచ్చిన తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటామని సదరు అధికారి పేర్కొన్నారు. ‘‘ఐసీసీ నుంచి టీ-20 ప్రపంచకప్ గురించి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాము. దాని తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.