ఉత్తరద్వారంలోనే రామయ్య దర్శనం
ABN , First Publish Date - 2020-12-05T05:10:47+05:30 IST
వైకుంఠ ఏకాదశి రోజైన ఈనెల 25న భద్రాచలం సీతారామచంద్రస్వామి వారు ఉత్తర ద్వారంలోనే దర్శనమివ్వనున్నారు. అయితే ఈ సారి కొవిడ్ నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల కారణంగా ఈ ఏడాది శ్రీరామనవమి నిర్వహించిన రీతిలో ఈ ముక్కోటి వేడుకలను కూడా నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ముక్కోటి నాడు భక్తులకు అనుమతి లేదు..
యాగశాలలోనే తెప్పోత్సవం నిర్వహణ
దేవస్థానం అధికారులకు కలెక్టర్ మౌఖిక ఆదేశాలు?
వైకుంఠ ఏకాదశి వేడుకలపై కొవిడ్ ప్రభావం
అధికారుల నిర్ణయంపై రామ భక్తుల ఆక్షేపణ
భద్రాచలం, డిసెంబరు 4 : వైకుంఠ ఏకాదశి రోజైన ఈనెల 25న భద్రాచలం సీతారామచంద్రస్వామి వారు ఉత్తర ద్వారంలోనే దర్శనమివ్వనున్నారు. అయితే ఈ సారి కొవిడ్ నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల కారణంగా ఈ ఏడాది శ్రీరామనవమి నిర్వహించిన రీతిలో ఈ ముక్కోటి వేడుకలను కూడా నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 24న నిర్వహించే తెప్పోత్సవాన్ని ఈసారి గోదావరిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా గోశాల పక్కన ఉన్న యాగశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాద్రి దేవస్థానం అధికారులకు జిల్లా కలెక్టరు నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు సమాచారం. ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 3న ‘ముక్కోటిపై స్పష్టత ఏదీ’ శీర్షికన ప్రచురించిన కథనంలో ఈ సారి గోదావరిలో రామయ్యకు తెప్పోత్సవం లేనట్లేనని పేర్కొంది. అధికారులు ఈ మేరకు అంతర్గత సమీక్షల్లో నిర్ణయించిన ప్రకారం గోశాల పక్కన ఉన్న యాగశాలలో తెప్పోత్సవం నిర్వహిస్తారని చెప్పింది. దానికి ఊతమిస్తూ అధికారులు తెప్పోత్సవాన్ని యాగశాలలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయంపై దేవస్థానం ఇవో బి.శివాజీని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తెప్పోత్సవం యాగశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న మాట వాస్తవమేనన్నారు. అలాగే ఉత్తరద్వార దర్శనంలో వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శనం ఉంటుందని ఇందు కోసం 200 మంది వీఐపీలను మాత్రమే అనుమతిస్తామన్నారు.
అధికారుల నిర్ణయంపై రామ భక్తుల ఆక్షేపణ
వైకుంఠ ఏకాదశికి భక్తులను అనుమతించమని, తెప్పోత్సవాన్ని యాగశాలలో నిర్వహిస్తామని అధికారులు నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల బల్దియా ఎన్నికల సమయంలో రాజకీయా పార్టీలు బహిరంగ సభలు, రోడ్షోలు చేసుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం.. భద్రాద్రి రామయ్యకు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను తిలకించేందుకు కరోనా పేరుతో ఆంక్షలు విధించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి అనుమతివ్వాలని, కనీసం తెప్పోత్సవాన్ని అయినా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న విధంగా గోదావరిలోనే హంసాలంకృత తెప్పపై నిర్వహించాలని కోరుతున్నారు.